2,087 గిరిజన గ్రామాలకు రోడ్లు లేవు: సత్యవతి రాథోడ్

by  |
2,087 గిరిజన గ్రామాలకు రోడ్లు లేవు: సత్యవతి రాథోడ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో 2,087 గిరిజన గ్రామాలకు ఇంకా రోడ్లు లేకుండా ఉండటం విచారకరమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. లాక్‌డౌన్ సమయంలో తండాలు, చెంచు పెంటలకు రోడ్డు లేకపోవడం వల్ల గిరిజన మహిళలు ఇబ్బంది పడిన సందర్భాలున్నాయని, అంగన్‌వాడీ సిబ్బంది వారి వ్యక్తిగత వాహనాల్లో వెళ్లి సాయం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఐటీడీఏలలోని రోడ్లు, ఆశ్రమ పాఠశాలలు, కిచెన్ షెడ్స్, ఇతర నిర్మాణ పనులను ఉపాధి హామీ పథకం కింద అనుసంధానంపై సంక్షేమ భవన్‌లో మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన శాఖ ఐటీడీఏ ప్రాంతాల్లోని పనులను ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజనులకు ఎక్కువగా ఉపాధి కల్పిస్తూ అభివృద్ధి, సంక్షేమ పనులు వేగంగా చేయాలన్నారు. అన్ని శాఖల్లో ఉపాధి, హామీ పథకం కింద వచ్చేనిధులను వినియోగించుకుని పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారని, ఇదే క్రమంలో గిరిజన శాఖలో కూడా ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టి, వేగంగా పూర్తి చేయాలన్నారు. గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తయారు చేసే ఉత్పత్తులు బయటి మార్కెట్‌లోని వాటికంటే చాలా నాణ్యంగా ఉన్నాయని, వీటికి మంచి మార్కెట్ ఉందని స్పష్టం చేశారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, అదనపు కమిషనర్ సర్వేశ్వర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ నగేశ్, జీసీసీ ఎండి విజయ్ కుమార్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed