కొందరు ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం

by  |
కొందరు ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో రైతుల అవసరాలకు తగ్గట్టుగానే యూరియా అందుబాటులో ఉందని, కొరత ఉందంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కరోనా విపత్తును గ్రహించే సీఎం కేసీఆర్‌ వ్యవసాయ రంగానికి పలు మినహాయింపులతో పాటు వెసులుబాటు ప్రకటించారని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఈ వానాకాలానికి కావాల్సిన అన్నిరకాల ఎరువులు కలిపి మొత్తం 22.30 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా ఇందులో 10.50 లక్షల మెట్రిక్‌ టన్నులు యూరియా ఉందన్నారు. ఈ మొత్తం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, దీనిని దశల వారీగా రాష్ర్టానికి తీసుకు వస్తున్నట్టు చెప్పారు.

జూలై నెల కోటా కేంద్రం సకాలంలో సరఫరా చేయలేదని, దీంతో వెంటనే స్వయంగా సీఎం కేసీఆర్‌ కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రితో మాట్లాడారని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. అంతేకాకుండా వ్యవసాయశాఖ మంత్రిగా తాను కూడా వెళ్లి కేంద్ర మంత్రిని కలిశానని, దీంతో వెంటనే జూలై కోటా సరఫరా మొదలు పెట్టిందని, ఈ నెలకు రావాల్సిన కోటా 2.05 లక్షల మెట్రిక్‌ టన్నులకుగాను 1.06 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందని వెల్లడించారు. మిగిలిన మొత్తం ఈ నెలాఖరులో ఇస్తామని కేంద్ర మంత్రి తెలిపారని, కరోనా ఇబ్బందులను గుర్తించే సీఎం కేసీఆర్‌ పలుమార్లు సుదీర్ఘ సమావేశాలు ఏర్పాటుచేసి మార్గనిర్ధేశం చేశారని చెప్పారు. అంతా సవ్యంగా జరుగుతన్నసమయంలో కొందరు రైతుల ఆత్మస్థయ్యిర్యం దెబ్బతీసేందుకు వదంతులు పుట్టిస్తున్నారని, రైతులు ఇలాంటి పుకార్లను నమ్మవద్దని మంత్రి సూచించారు.


Next Story

Most Viewed