తెలంగాణ నుంచే కరోనాకు తొలి టీకా

by  |
తెలంగాణ నుంచే కరోనాకు తొలి టీకా
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా మానవాళికి ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్‌కు తొలి టీకా (వ్యాక్సిన్) తెలంగాణ నుంచే వస్తుందని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తంచేశారు. హైద‌రాబాద్‌లోని భార‌త్‌ బ‌యోటెక్ సంస్థ నుంచే ఆ టీకా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయని అభిప్రాయ‌ప‌డ్డారు. క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ త‌యారీలో భార‌త్‌ బ‌యోటెక్ ముందు వరుసలో ఉండ‌డం గ‌ర్వంగా ఉంద‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ తయారీలో మన దేశ భాగస్వామ్యం చాలా కీలకమైనదని, ప్రపంచ దేశాల్లోనే మనకు ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, ప్రపంచ దేశాల్లోని వైరస్‌లకు వ్యాక్సిన్‌ను అభివృధ్ధి చేయడం ద్వారా ఈ ప్రాధాన్యత పెరిగిందని మంత్రి గుర్తుచేశారు. ప్రపంచంలోని వ్యాక్సిన్‌లలో దాదాపు మూడవ వంతు హైదరాబాద్ నగరం నుంచే ఉత్పత్తి అవుతున్నట్లు పేర్కొన్నారు. జీనోమ్ వ్యాలీలోని భార‌త్ బ‌యోటెక్ వ్యాక్సిన్ ప్రొడ‌క్షన్ సెంట‌ర్‌ను సంద‌ర్శించి అక్కడి ఉద్యోగులతో మాట్లాడిన అనంతరం ఆ సంస్థ సీఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా, తెలంగాణ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా డైర‌క్టర్ శ‌క్తి నాగ‌ప్పన్‌తో క‌లిసి నిర్వహించిన చర్చలో మాట్లాడిన మంత్రి పై వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాధన్ కూడా ఈ చర్చలో పాల్గొని ఇప్పటికింకా ప్రపంచవ్యాప్తంగా కరోనా కోసం తయారుచేస్తున్న వ్యాక్సిన్‌లు వివిధ దశల్లో ఉన్నాయని, ప్రజలకు అందుబాటులోకి రావడానికి మరింత సమయం పట్టొచ్చని అన్నారు. ఎంతకాలం పడుతుందనేది చెప్పలేమని, కానీ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఒక స్పష్టత వస్తుందన్నారు.

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ గురించి డాక్టర్ సౌమ్యా స్వామినాధన్ మాట్లాడుతూ, దేశీయంగా, ప్రపంచ‌వ్యాప్తంగా వ్యాక్సిన్‌పై చ‌ర్చ భిన్న స్థాయిల్లో లోతుగా జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, వైర‌స్ ఇమ్యూనిటీ గురించి ఇంకా తెలుసుకునే ద‌శ‌లోనే ఉన్నామ‌న్నారు. వైర‌స్ ఎక్కువ‌గా ఎవరికి సంక్రమిస్తుందో, ఎవ‌రికి సంక్రమించ‌డం లేదో తెలుసుకోవాల్సి ఉందని, పిల్లల్లో ఎందుకు వైర‌స్ కేసులు త‌క్కువ‌గా ఉన్నాయో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. భార‌త్‌లో ప్రస్తుతం క‌రోనా వైర‌స్ టెస్టింగ్ ప్రక్రియ త‌క్కువ స్థాయిలో జ‌రుగుతున్నదని, జ‌పాన్‌, చైనా, కొరియా, అమెరికా లాంటి దేశాల్లో అధిక స్థాయిలో జ‌రుగుతున్నదని ఆమె గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 27 వ్యాక్సిన్‌లకు క్లినిక‌ల్ ట్రయ‌ల్స్ జ‌రుగుతున్నాయని, ఈ ట్రయ‌ల్స్‌లోని టీకాల సామ‌ర్థ్యం, భ‌ద్రత‌ ఇప్పుడే తెలియదని, మరికొన్ని నెలలు పట్టవచ్చని, వ్యాక్సిన్ వ‌చ్చినా కనీసం రెండేళ్ల పాటు ఆ టీకా సేఫ్టీ ప్రొఫైల్‌ను గ‌మ‌నించాల్సి ఉంటుంద‌ని అన్నారు.

టీకా సామ‌ర్థ్యం ఎంతవ‌ర‌కు ఉంటుందో అధ్యయనం చేయాల‌ని, కనీసంగా 50-70 శాతం మధ్యలో దాని ప్రభావం ఉండాలన్నారు. 50 శాతం క‌న్నా త‌క్కువ సామ‌ర్థ్యం ఉంటే ఆ వ్యాక్సిన్ వాడ‌డం మంచిది కాదని అభిప్రపాయపడ్డారు. ఏ వ్యాక్సిన్ స‌క్సెస్ రేటు ఎక్కువ‌గా ఉంటుందో, దానిని నిల్వ చేయడం ఎలాగో ఇప్పుడే చెప్ప‌లేమ‌ని, హెచ్ఐవీ, మ‌లేరియా లాంటి వ్యాధుల‌కు దీర్గకాలం పరిశోధన జరిగి దశాబ్దాల పాటు టెస్టింగ్ జ‌రిగింద‌ని ఆమె గుర్తుచేశారు. ప్రస్తుతం కరోనా వైర‌స్‌ను ఇంకా పూర్తిగా స్టడీ చేయ‌లేద‌ని, అందుకే వ్యాక్సిన్ రూపొందించేందుకు మ‌రింత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయన్నారు. మూడ‌వ ద‌శ ట్రయల్స్‌లో ఎఫ‌క‌సీ (సామర్థ్యం) అంశాన్ని ప‌రిశీలించిన త‌ర్వాతే వ్యాక్సిన్ ఎంతవ‌ర‌కు సుర‌క్షిత‌మైందో చెప్పగలుగుతామన్నారు. అందుకోసమే వ్యాక్సిన్ ప్రజలకు వినియోగంలోకి రావడానికి ఆరు నెలలు పడుతుందా లేక సంవత్సరం పడుతునా అనే అంశాన్ని ఇప్పుడు ఊహించలేమన్నారు. పైగా వైరస్ నివారణకు వ్యాక్సిన్ ఒక్కటే ప‌రిష్కారం కాదని, ప్రజల జాగ్రత్తలు, ఔషధాలు కూడా ముఖ్యమన్నారు. వ్యాక్సిన్ సిల్వర్ బుల్లెట్ కాదని చమత్కరించారు. అంతిమంగా వ్యాధి తీవ్రత‌ను త‌గ్గించేది ఔష‌ధాలు మాత్రమేనని నొక్కిచెప్పారు.


Next Story

Most Viewed