కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం…

by  |
కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం…
X

దిశ, నిర్మల్: జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో కరోనా వైరస్ నియంత్రణపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీతో కలిసి మంత్రి మాట్లాడారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని, ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి, సామజికదూరం పాటించాలన్నారు.

జిల్లాలో ఇప్పటివరకు 2757 మందికి శాంపుల్స్ సేకరించామని, 469 పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. అందులో 314 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. 149 మందిని డిశ్చార్జి చేశామన్నారు. హోం ఐసోలేషన్‌లో 271మంది ఉన్నారని, వైరస్ మూలంగా జిల్లాలో ఆరుగురు మరణించారన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి మెడికల్ కిట్లను అందజేస్తున్నామని, అధికారులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సేవలందిస్తున్నారని అన్నారు.

అలాగే 15ఆగస్టు, వినాయక చవితి పండగ ఉత్సవాలను ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ నిబంధనలు పాటించాలన్నారు. జిల్లాలోని ప్రాంతీయ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.


Next Story