‘మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంట సాగు’

by  |
‘మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంట సాగు’
X

దిశ, రంగారెడ్డి: సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేందుకే రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు విధానాన్నిప్రభుత్వం ప్రవేశపెట్టిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో వర్షాకాల పంటల సాగు కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర్యానంతరం ఇప్పటివరకూ రైతాంగంలో శాస్త్రీయ విధానం లేదని, రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకే సీఎం కేసీఆర్ నియంత్రిత పంటల విధానాన్ని ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. ఏ భూమిలో ఏ పంట వేస్తే రైతులు లాభపడుతారో సూచిస్తూ రైతులను సంపన్నులను చేయడానికే క్లస్టర్ల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తున్నామని అన్నారు. అర్హులైన ప్రతిరైతుకూ రైతుబంధు లభిస్తుందని, అయితే ప్రభుత్వం సూచించిన పంటలు మాత్రమే వేయాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో మొక్కజొన్న పంటలు వేయొద్దని, వాటి స్థానంలో వ్యవసాయ అధికారులు సూచించిన ప్రత్యామ్నాయ పంటలను వేయాలని సూచించారు. గత వానకాలంలో రంగారెడ్డి జిల్లాలో లక్షా ఎనిమిది వేల ఎకరాల్లో మొక్కలను పండించడం జరిగిందని, మార్కెట్‌లో మొక్కలకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడ్డారని మంత్రి తెలిపారు. జిల్లాలో గతేడాది 2 లక్షల 18 వేల ఎకరాల్లో పత్తి పండించామని, ఈసారి దీనిని 2 లక్షల 60 వేలకు పెంచాలని నిర్ణయించామని వెల్లడించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి పంటను పండించాలని, ఇందుకు వరి విత్తనాలను ప్రభుత్వమే రైతులకు అందిస్తోందని అన్నారు. జిల్లాలో 18 వేల ఎకరాల్లో మాత్రమే కందులను పండిస్తున్నారని, ఈ కందుల విస్తీర్ణాన్ని లక్ష ఎకరాలకు పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. జిల్లాలో ఏ భూమిలో ఏ పంటలు వేయాలో, విత్తనాలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ సదుపాయం తదితర అంశాలపై రైతులను చైతన్య పర్చాలని సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి, పి.రాములు, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, జెడ్పీ చైర్ పర్సన తీగల అనితారెడ్డి, కలెక్టర్ అమోయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ హరీష్, తదితరులు పాల్గొన్నారు.


Next Story