రాష్ట్రంలో కరోనా ఆగస్టులో శాంతిస్తుంది

by  |
రాష్ట్రంలో కరోనా ఆగస్టులో శాంతిస్తుంది
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్‌ను ముందుగా గుర్తిస్తే ప్రాణాంతకమేమీ కాదని, నిమిషానికి ఇరవైసార్లకంటే ఎక్కువగా గాలి పీల్చాల్సి వస్తే తప్పకుండా డాక్టరును సంప్రదించాల్సిందేనని చికాగో యూనివర్శిటీ అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ విజయ్ ఎల్దండి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైరస్ వ్యాప్తి, రాష్ట్రంలోని పరిస్థితులపై రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులను విశ్లేషించిన డాక్టర్ విజయ్, ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ ఆగస్టు నాటికి శాంతిస్తుందని, కానీ నవంబరులో మళ్ళీ రెండో వేవ్‌గా విజృంభిస్తుందని అన్నారు. సామూహికంగా గుంపులుగా జనం చేరడం, ఎక్కువ మంది హాజరయ్యే కార్యక్రమాలను నిర్వహించడం లాంటివన్నీ వైరస్ వ్యాప్తికి కారణాలవుతాయని, అందులో పాల్గొంటే వైరస్‌ను కోరి కొని తెచ్చుకున్నట్టేనని అన్నారు.

కరోనాను ముందుగా గుర్తించడానికి శ్వాసలో వచ్చే మార్పులు సరిపోతాయని, ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు నిమిషానికి ఇరవైసార్లు గాలి పీలుస్తున్నారంటే తప్పకుండా డాక్టరును సంప్రదించాల్సిందేనని, ప్రాథమిక దశలోనే గుర్తించినట్లవుతుందన్నారు. ఆక్సిజన్ స్థాయి ఏ మోతాదులో ఉందో గమనిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోడానికి వీలవుతుందన్నారు. ఏం చేసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు కరోనా వ్యాప్తి తప్పదని, కానీ దానికి తగిన తీరులో చికిత్స, తదుపరి చర్యలు తీసుకోవడం ముఖ్యంగానీ, భయపడితే ఫలితం ఉండదన్నారు. కరోనా అంటే ప్రజల్లో ఒక భయం నెలకొనిందని, కానీ ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఉండడం ద్వారా సగం సమస్య పరిష్కారమవుతుందన్నారు.

ఏఎన్ఏఎంలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే పరీక్షలు

రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వైద్యారోగ్య సిబ్బంది సమిష్టి కృషి గురించి డాక్టర్ విజయ్ ఎల్దండకు రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ సౌకర్యాన్ని సిద్ధంగా ఉంచిందని, వివిధ రకాల లక్షణాలకు అవసరమైన మందులు కూడా తగినంత నిల్వ ఉన్నాయన్నారు. కరోనాను ముందుగానే గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పనిచేస్తున్నారని, వారికి ఇన్‌ఫెక్షన్ సోకిందో లేదో తెలుసుకోడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే చికిత్సలు చేస్తున్నామని, అత్యవసర చికిత్స అవసరమైనవారిని టెరిటరీ కేర్ ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు మంత్రి వివరించారు.


Next Story

Most Viewed