గాంధీ తరహాలో ఎంజీఎం : ఈటల

by  |
గాంధీ తరహాలో ఎంజీఎం : ఈటల
X

దిశ ప్రతినిధి, వరంగల్: కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ గాంధీ తరహాలో వరంగల్ ఎంజీఎంను తీర్చిదిద్దుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తదితరులతో కలిసి ఎంజీఎం సందర్శించిన అనంతరం ఆయన వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వం పక్షాన వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు.

వరంగల్ ఎంజీఎం లో ప్రస్తుతం కరోనా సోకిన వారి కోసం ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 340 బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. కొద్ది రోజుల్లోనే వాటి సంఖ్యను 750కు పెంచుతామన్నారు. అవసరమైన టెస్ట్ కిట్లు, మందులు, పరికరాలు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. వరంగల్ నగరానికి ప్రత్యేకంగా మోబైల్ ల్యాబ్స్ పంపించనున్నట్టు ఈటల ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్‌పై ఎక్కువ దృష్టి పెట్టామని, ఎంజీఎంలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కేఎంసీలో మరో వార్డు సిద్ధం చేస్తున్నామని ఎంత మంది రోగులొచ్చినా హైదరాబాద్ కానీ, ప్రైవేటు ఆస్పత్రులకు కానీ పోవాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. కరోనా సోకిన వారిలో 81 శాతం మందికి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని, మిగతా వారిలో కూడా ఎక్కువ శాతం మంది కోలుకుంటున్నట్టు చెప్పారు.

మరణాల సంఖ్య ఒక శాతంలోపే ఉన్నందున ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. వైరస్ సోకిన వారు ధైర్యంగా ఉండడమే అసలు మందని వైరస్ సోకిన వారు ఆస్పత్రిలో ఉన్నా, హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నా వైద్యులు ఎప్పటికప్పుడు రోగుల పరిస్థితిని పరిశీలిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఎవరైనా కోవిడ్ వల్ల చనిపోతే, వారి బంధువులు రాకుంటే ప్రభుత్వ పరంగానే అంత్యక్రియలు కూడా చేస్తున్నాం’’ అని ఈటల వెల్లడించారు. ‘‘కరోనా విషయంలో శ్రద్ధ పెడుతూనే సీజనల్, అంటు వ్యాధులపై కూడా దృష్టి పెట్టాలన్నారు. వైద్యుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆస్పత్రుల్లో అవసరమైన సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియమించుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చామని ఈటల వెల్లడించారు.



Next Story