మంత్రి ఎర్రబెల్లి సవాల్.. కొవిడ్ వార్డులోకి పోవాలంట

by  |
మంత్రి ఎర్రబెల్లి సవాల్.. కొవిడ్ వార్డులోకి పోవాలంట
X

దిశ ప్రతినిధి, వరంగల్: ‘ఇటీవల కురిసిన వర్షాలకు వరంగల్ నగరం అతలాకుతలం అయింది.సీఎం కేసీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు మమ్మల్ని అప్రమత్తం చేసి ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకునేలా అప్రమత్తం చేశారు. ఇలాంటి సమయంలో కూడా ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం సరికాదు’ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హన్మకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండా ప్రకాశ్ రావుతో కలిసి మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షం పడింది.. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రాణ నష్టం జరుగలేదు.. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. అక్రమ కట్టడాలు ఏ పార్టీ వారివైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. దసరా నాటికి అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ప్రజల కోరిక మేరకే అక్రమ కట్టడాల కూల్చివేతలు చేపట్టామని వెల్లడించారు. దీన్ని కూడా రాజకీయం చేయొద్దన్నారు.

వరంగల్ అభివృద్ధి పై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారని తెలిపారు. రూ. 25 కోట్లు తాత్కాలిక సహాయమే‌ అయినప్పటికీ పూర్తిస్థాయిలో అంచనా వేశాక మరిన్ని నిధులు మంజూరు చేస్తామని వివరించారు. బయటి వ్యక్తులు వచ్చి వరంగల్ పై ఏదో మాట్లాడితే ఇక్కడి ప్రజలు సహకరించొద్దన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ భూపాలపల్లిలో 10 మంది రైతులను కాపాడితే ప్రతిపక్షాలు అభినందించాయా అని ప్రశ్నించారు. మిషన్ కాకతీయ వల్లే ఇంత వర్షం వచ్చినా ఒక్క చెరువు తెగలేదని గుర్తు చేశారు.

ప్రతిపక్షాలు అభినందించకపోయినా పర్వాలేదు కానీ అర్థరహిత విమర్శలు చేయడం సరికాదని మంత్రి హితవు పలికారు. ఎంజీఎంలోని కొవిడ్ వార్డుకు కేటీఆర్ తో పాటు నేను ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రాజయ్య కలిసి వెళ్లాం. వారికి మెరుగైన వైద్యం అందుతున్నట్లు రోగులు సంతోషంగా వెలిబుచ్చారన్నారు. ప్రతిపక్షాలు మాతో వస్తే చూపిస్తామని సవాల్ విసిరారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ నాలాలపై అక్రమ కట్టడాలతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఇలాంటి అక్రమ కట్టడాలను తొలగించేందుకు సహకరించాలని కోరారు.


Next Story

Most Viewed