నాన్న, కొడుకు, ఓ ఆవు.. కదిలించే కథ

by  |
నాన్న, కొడుకు, ఓ ఆవు.. కదిలించే కథ
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా.. ఈ ఒక్క వైరస్ కొన్ని కోట్ల మంది జీవితాలతో ఆడుకుంటోంది. బడా బడా వ్యాపారాల నుంచి చిన్నచితకా వ్యాపారాలదాకా అన్నింటిపై తన పంజా విసిరింది. ఈ పరిస్థితుల్లో మధ్య తరగతి, పేదోళ్ల వ్యథల గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతలా వారి జీవితాలను తలకిందులు చేసింది కరోనా. ఇంతటి కష్ట కాలంలోనూ పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచించిన ఓ తండ్రి వ్యథే ఇది. స్కూళ్లు ఓపెన్ కాకపోవడంతో ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ఆన్‌లైన్ క్లాసులకు తెరతీసిన సంగతి తెలిసిందే. మరి క్లాసులు వినాలంటే.. ఇంట్లో కంప్యూటర్, ల్యాపీ లేకపోయినా.. ఓ స్మార్ట్ ఫోన్ అయినా ఉండాలి కదా. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా, జ్వాలాముఖికి చెందిన కుల్దీప్ కుమార్‌ అనే పేద రైతుకు ఫోన్ అవసరమే కానీ.. స్మార్ట్ ఫోన్ అవసరమేముంటుంది. కానీ కొడుకు క్లాసులు వినాలంటే.. ఫోన్ కావాలి? చేతిలో డబ్బులు లేవు? అప్పు ఇచ్చే నాథుడు లేడు? మరి ఆ తండ్రి ఏం చేశాడు?

రైతుగా జీవనం కొనసాగిస్తున్న కుల్దీప్ కుమార్.. తన కొడుకు భవిష్యత్ బాగుండాలనే ఉద్దేశంతో సర్కారు బడిలో కాకుండా, ప్రైవేటు బడిలో చేర్పించాడు. కానీ లాక్‌డౌన్ కారణంగా పాఠశాల యాజమాన్యం ఆన్‌లైన్ క్లాసులు మొదలెట్టింది. కానీ వారి వద్ద స్మార్ట్ ఫోన్ లేదు. ఈ క్రమంలో ఓవైపు కుల్దీప్ కొడుకేమో.. క్లాసులు పోతున్నాయని గోల. మరోవైపు పిల్లల చదువులు కొనసాగాలంటే స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందేనంటూ కరాఖండిగా తేల్చిచెప్పిన స్కూల్ మేనేజ్‌మెంట్. ఈ నేపథ్యంలో ఆ పేద తండ్రికి ఏం చేయాలో అర్థం కాలేదు. రూ. 6 వేల కోసం బ్యాంకులు చుట్టూ తిరిగాడు. అక్కడా నిరాశే ఎదురైంది. అన్నిదారులూ మూసుకుపోయాయి. ఓ చిన్న పాకలో తన భార్య, ఇద్దరు పిల్లలతో జీవనం సాగించే కుల్దీప్‌కు ఏకైక జీవనాధారం తన ఆవే. ఓ వైపు కొడుకు భవిష్యత్.. మరోవైపు జీవనాధారం. ఎంతైన కన్నపేగు కదా! కొడుకు గురించే ఆలోచించాడు. విధిలేక ఆవును అమ్మేయాలనుకున్నాడు. తన పరిస్థితిని అర్థం చేసుకోకపోగా, ఆవును ఆరు వేలకే కొనుగోలు చేసి కుల్దీప్ అవసరాన్ని క్యాష్ చేసుకున్నాడు వ్యాపారి. ఆన్‌లైన్ తరగతుల వల్ల.. ఇలా ఎంతోమంది తమ తలకుమించిన భారాన్ని అనుభవిస్తున్నారు. ఇక్కడ కుల్దీప్ వ్యథ మనందరి ముందుకొచ్చింది.

‘మా కుటుంబానికి కనీసం రేషన్ కార్డు కూడా లేదు. ఆర్థిక సాయం కోసం ఎన్నోసార్లు పంచాయతీ కార్యాలయానికి వెళ్లినా పట్టించుకోలేదు’ అని కుల్దీప్ తెలిపాడు. కాగా ఈ వ్యవహారం మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారడంతో జ్వాలాముఖి ఎమ్మెల్యే రమేశ్ దవాలా స్పందించారు. కుల్దీప్ కుమార్ కుటుంబానికి వెంటనే ఆర్థిక సాయం చేయాలంటూ అధికారులను ఆదేశించినట్టు ఆయన పేర్కొన్నారు.


Next Story

Most Viewed