ఎటూ తేలని ‘మిలిటరీ’ చర్చలు

by  |
ఎటూ తేలని ‘మిలిటరీ’ చర్చలు
X

న్యూఢిల్లీ: సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించడానికి జరుగుతున్న చర్చలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ఇరుదేశాల కార్ప్స్ కమాండర్ స్థాయి మూడో రౌండ్ చర్చలు ఎటూ తేలకుండా ముగిశాయి. ఉద్రిక్తతలు తగ్గించడానికి అనుసరించే విధానాలు, బలగాల ఉపసంహణ అంశాలు ప్రధానంగా లడాఖ్‌లోని చుశుల్ సెక్టార్‌లో మంగళవారం సుమారు పది గంటలపాటు సాగిన ఈ చర్చలు అసంపూర్తిగానే మిగిలాయి. ఇరుదేశాలు సరిహద్దులో శాంతికి నెలకొల్పేందుకు ఇరుదేశాల ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. కానీ, కొన్ని కీలక నిర్ణయాల్లో ఏకాభిప్రాయం కుదరలేదని, ఇందుకు మరిన్ని చర్చలు అవసరమని ఇరుపక్షాలు భావించినట్టు తెలిసింది.

ఒకవైపు శాంతి చర్చలు సాగిస్తూనే చైనా మరోవైపు బలగాలను మోహరిస్తున్నది. తూర్పు లడాఖ్‌ సెక్టార్ సరిహద్దుకు సమీపంలో చైనా 20వేల ట్రూపులను తరలించిందని టాప్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, మరో 10వేల ట్రూపులు ఉత్తర జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో రిజర్వ్‌లో ఉంచినట్టు వివరించారు. రెండు రోజుల్లో సరిహద్దు చేరే దూరంలో వారిని ఉంచినట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, భద్రత పరిస్థితులను పర్యవేక్షించేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె శుక్రవారం లడాఖ్‌ పర్యటించనున్నారు. ఎల్ఏసీ సరిహద్దులో భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొస్తున్న నేపథ్యంలో మనదేశ బలగాల అప్రమత్తతను పరిశీలించనున్నారు. సరిహద్దులో నెలకొన్న పరిస్థితులను పరిశీలించడానికి ఆర్మీ చీఫ్ ఎంఎం జనరల్ నరవాణె రెండు రోజులు పర్యటించిన సంగతి తెలిసిందే. అనంతరం అక్కడి పరిస్థితులను కేంద్ర రక్షణ మంత్రికి వివరించారు. తాజాగా కేంద్ర రక్షణ మంత్రి స్వయంగా లడాఖ్‌కు వెళ్తున్నారు. గాల్వన్ లోయ ఘటన తర్వాత కేంద్ర రక్షణ మంత్రి పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.


Next Story