ఈనెల 7 నుంచి మెట్రో పరుగులు

by  |
ఈనెల 7 నుంచి మెట్రో పరుగులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఈ నెల 7నుంచి మెట్రో పరుగులు పెట్టనుంది. అన్‌లాక్ -4 నిబంధనలకు సంబంధించిన మార్గనిర్ధేశకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో మార్చి 22 నుంచి మెట్రో సేవలు నిలిచిపోయాయి. దాదాపు ఆరు నెలల తర్వాత గ్రేటర్‌లో మెట్రో రైళ్లు తిరగనున్నాయి. ఈ నెల 21 నుంచి ఉపాధ్యాయులు, నాన్- టీచింగ్ స్టాప్ కలిసి 50శాతం మందిని అనుమతిస్తున్నట్టు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వంద మందికి మించకుండా, హెల్త్ ప్రొటోకాల్ పాటిస్తూ రాజకీయ, స్పోర్ట్స్, కల్చరల్ సమావేశాలను నిర్వహించేందుకు అనుమతించారు.

పెళ్లిళ్లకు, అంత్యక్రియలకు ఇప్పటివరకు 50 మందిని అనుమతిస్తుండగా.. 21 నుంచి ఈ పరిమితిని వంద మందికి పెంచుతున్నారు. కంటైన్‌మెంట్ జోన్ మినహా మిగిలిన ప్రాంతాల్లో 9-12 తరగతుల విద్యార్థులను స్కూళ్లకు వెళ్లేందుకు అనుమతించారు. ఓపెన్ ఎయిర్ థియేటర్లను కూడా ఈ నెల 21 నుంచి తెరిచి ఉంచనున్నారు. అయితే బార్లు, క్లబ్స్ మాత్రం తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ అనుమతి లేదని ప్రభుత్వం పేర్కొంది. పదేండ్ల లోపు పిల్లలు, 65 ఏండ్లు పైబడిన వారిని ఇంట్లోనే ఉండాలని సూచించారు. కంటైన్‌మెంట్ జోన్లలో సెప్టెంబర్ 30 వరకూ కఠిన లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. ఆన్‌లైన్ క్లాసులు యథావిధిగా కొనసాగుతాయని మార్గనిర్ధేశకాల్లో ప్రభుత్వం తెలిపింది. స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ సంస్థలు, సినిమా హాల్స్, స్విమ్మింగ్ ఫూల్స్ తెరుచుకోవడం లేదు.


Next Story

Most Viewed