మెట్రో సైరన్.. ఫస్ట్ డే మియాపూర్-ఎల్‌బీనగర్!

by  |
మెట్రో సైరన్.. ఫస్ట్ డే మియాపూర్-ఎల్‌బీనగర్!
X

దిశ, న్యూస్‌బ్యూరో :

మెట్రో రైలు ఈనెల ఏడు నుంచి పరుగులు పెట్టనుంది. పున:‌ప్రారంభం సందర్భంగా నాణ్యతాపరమైన నిర్వహణ పద్ధతులను పాటిస్తున్నట్టు మెట్రో రైలు సంస్థ గురువారం వెల్లడించింది. కరోనా నేపథ్యంలో మార్చి 22 నుంచి మెట్రో సర్వీసులు నిలిపేసిన విషయం విదితమే. ప్రభుత్వం ఆదేశాల మేరకు మూడు దశలుగా రైళ్ళను నడపాలని నిర్ణయించింది. మొదటి దశలో సెప్టెంబర్ 7న కారిడార్-1 మియాపూర్- ఎల్‌బీ నగర్ మార్గంలో ఉ.7 గం.ల నుంచి మ. 12 గం.ల వరకు, సా. 4 గం.ల – రా.9 గం.ల వరకు నడపనున్నట్టు సంస్థ ప్రకటించింది.

రెండో దశలో సెప్టెంబర్ 8న కారిడార్-3 నాగోల్ – రాయ్‌దుర్గం వరకు ఉ.7 గం.ల నుంచి మ. 12 గం.ల వరకు, సా.4గం.ల నుంచి రా.9 గం.ల వరకు నడపనున్నట్టు వెల్లడించింది. మూడో దశలో సెప్టెంబర్ 9 నుంచి అన్ని కారిడార్లలో ఉ.7గం.ల నుంచి రా.9 గం.ల వరకు రైళ్లను నడపనున్నట్టు సంస్థ వివరించింది. సాధారణంగా ప్రతి 5 ని.లకు ఒక రైలు ఉంటుందని, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సమయాల్లో మార్పులు చేర్పులుంటాయని తెలిపింది. కంటైన్‌మెంట్ జోన్లను పరిగణనలోకి తీసుకుని గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్, యూసుఫ్‌గూడ, మూసాపేట్, భరత్‌నగర్‌లలోని స్టేషన్లను మూసివేస్తున్నట్టు పేర్కొన్నది. ప్రయాణికుల మధ్య దూరం పాటించడం కోసం స్టేషన్లలో, రైలు బోగీల్లో మార్కింగ్ చేసినట్టు, సీట్లలోనూ ఒకటి విడిచి మరో సీటును కూర్చునేందుకు కేటాయించినట్టు తెలిపింది.

మాస్కులు ధరించకుంటే జరిమానాలుంటాయన్నారు. ప్రవేశ ద్వారం వద్ద శానిటైజర్లను ఏర్పాటు చేయడంతోపాటు ప్రయాణికులను పరీక్షించిన తర్వాతే స్టేషన్లోకి అనుమతించనున్నట్టు తెలిపారు. ప్రతి 4గం.లకు ఒకమారు ప్రయాణికులు తిరుగాడే ప్రాంతాలను శానిటైజ్ చేస్తామని వెల్లడించారు. స్టేషన్లలో రైలు ట్రిప్పుట్రిప్పుకు పరిశుభ్రం చేస్తామని మెట్రో సంస్థ తెలిపింది.



Next Story

Most Viewed