మానసిక రోగిపై గ్రామస్తుల దాడి.. వ్యక్తి మృతి

by  |
మానసిక రోగిపై గ్రామస్తుల దాడి.. వ్యక్తి మృతి
X

దిశ, ములుగు: ములుగు జిల్లాలో దారుణం జరిగింది. మానసిక రోగి పై గ్రామస్తులు దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన జిల్లాలోని వెంకటాపూర్ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్వారీ పల్లి(లక్ష్మిపురం ) గ్రామానికి చెందిన మందారపు శ్రీనివాస్ కొంత కాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం స్థానిక హనుమాన్ దేవాలయంలో అతను దిగంబరంగా పూజలు నిర్వహించాడు. దేవాలయం నుంచి బయటకు వెళుతున్న క్రమంలో గమనించిన ఇద్దరు వ్యక్తులు తాళ్లతో చేతులు కట్టేసి దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు మరికొందరూ అతడి పై మూకుమ్మడిగా దాడికి దిగారు.

దెబ్బలు తాళలేక సదరు వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ములుగు ఏఎస్పీ సాయిచైతన్య, ములుగు సీఐ దేవేందర్ రెడ్డి, వెంకటాపూర్ ఎస్ఐ నరహరి ఘటనా స్థలికి చేరుకుని దాడికి గల కారణాలపై ఆరా తీశారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితిని గమనించి గ్రామంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీనివాస్ మృతదేహాన్ని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Next Story