ఫుడ్ ప్రాసెసింగ్‌తో రైతుకు ఆర్థిక స్వావలంబన

by  |
ఫుడ్ ప్రాసెసింగ్‌తో రైతుకు ఆర్థిక స్వావలంబన
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఆహారశుద్ధి, లాజిస్టిక్స్ పాలసీపై గైడ్‌లైన్స్ రూపకల్పనకు బుధవారం ప్రగతిభవన్‌లో మంత్రులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ మార్గదర్శకత్వంలో పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తులు, ఆహారశుద్ధి రంగంలో నూతన అవకాశాలపై వివరించారు. జల విప్లవంతో లక్షలాది ఎకరాల బీడు భూములు కృష్ణా, గోదావరి నదుల నీటితో సస్యశ్యామలం అవుతున్నాయన్నారు. ఈ జలవిప్లవం తోడ్పాటుతో నీలి విప్లవం(మత్స్య పరిశ్రమ), గులాబీ విప్లవం(మాంస ఉత్పత్తి పరిశ్రమ), శ్వేతా విప్లవం(పాడి పరిశ్రమ) కూడా రానున్నాయన్నారు. ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో ఏయే పంటలు పండుతున్నాయి అనేది పూర్తిగా మ్యాపింగ్ చేశామన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక వరి, పత్తి, మొక్క జొన్న, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి బాగా పెరిగిందన్నారు. గొర్రెల పంపకం, చేప పిల్లల పెంపకం వల్ల రాష్ట్రంలో గొర్రెల సంఖ్య, చేపల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగిందన్నారు.

ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న పంటలను పూర్తిగా ప్రాసెసింగ్ చేసే సామర్ధ్యం మనకు లేదని, దీనితో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తయితే వ్యవసాయ ఉత్పత్తులు ఇంకా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. అందువల్ల వెంటనే ఆహార శుద్ధిరంగ పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, తద్వారా మన రైతుకు ఆర్థిక స్వావలంబన, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. తెలంగాణలో ఆహార శుద్ధి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రతిపాదిస్తున్నామని, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న ప్రోత్సాహకాలు పరిశీలించామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, లాజిస్టిక్స్ పాలసీలపై మంత్రులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. భేటీలో మంత్రులు కొన్ని సూచనలు చేశారని, వాటిని కూడా పాలసీలో, మార్గదర్శకాల కూర్పులో వినియోగించుకుంటామని కేటీఆర్ చెప్పారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, ఈటల, మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్, తలసాని, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ వినోదకుమార్ పాల్గొన్నారు.



Next Story