ఢిల్లీ భద్రతా బలగాల్లో.. బెల్జియన్ మాలినోయిస్

by  |
ఢిల్లీ భద్రతా బలగాల్లో.. బెల్జియన్ మాలినోయిస్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రధాని మోదీ ఇటీవలే దేశ భద్రతలో సత్తా చాటుతున్న శునకాలు ‘సోఫీ, విధ’ గురించి ‘మన్ కీ బాత్‌‌’తో ప్రస్తావించిన విషయం తెలిసిందే. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక శిక్షణ పొందిన ‘పోలో’ అనే శునకం.. ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్లలో కేంద్రీయ పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బందితో కలిసి విధులు నిర్వహించనుంది. మరి బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన ఈ శునకం ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.

దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలకు ‘టెర్రర్’ అటాక్ పొంచి ఉంటుంది. అందువల్లే ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, మెట్రో స్టేషన్లు, ఇతర ప్రముఖ ప్రాంతాల్లో సీఐఎస్ఎఫ్ విధులు నిర్వర్తిస్తుంటుంది. వీరితో పాటు స్పెషల్ ట్రెయిన్డ్ ‘పోలో’ అనే డాగ్.. తొలిసారి కలిసి పనిచేయనుంది. మెట్రో రైళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ పరిధిలోని కీలక మెట్రో స్టేషన్లలో ‘పోలో’ కనిపించనుంది. చురుకైన బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన కుక్కను దేశ రాజధానిలో విధుల్లో నియమించడం ఇదే తొలిసారి.

బెల్జియన్ మాలినోయిస్ అనే శునకానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. ఇవి వాసన పసిగట్టడంలో చాలా చురుగ్గా వ్యవహరిస్తాయి. అంతేకాదు.. ఇవి అటాక్ చేయడంలోనూ ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇవి అథ్లెటిక్ డాగ్స్‌గా కూడా పేరొందాయి. ‘స్నిఫ్, అటాక్, గార్డ్’ అనే మూడు లక్షణాలే వీటిని ప్రత్యేకంగా నిలిపాయి. అయితే, ‘జర్మన్ షెపర్డ్, లాబ్రాడర్, కాకర్ స్పైనల్’ తదితర జాతి కుక్కలు.. కేవలం 4 నుంచి 7 కిలోమీటర్లు మాత్రమే నడుస్తాయి. ఆ బ్రీడ్స్ ఏదో ఒక విషయంలోనే ప్రత్యేకత చాటుతాయి. కానీ బెల్జియన్ మాలినోయిస్ జాతి శునకాలు మాత్రం.. ఏకంగా 40 కిలోమీటర్ల వరకు ఏకధాటిగా నడవగలవు. అందుకే వీటి అథ్లెటిక్ ఎబిలిటీకి వేరే ఏ శునకాలు సాటి రావు.

అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా సీల్స్ మట్టుబెట్టడంలో ఈ జాతికి చెందిన శునకం ‘కైరో’ కీలకంగా నిలిచింది. దీంతో నాటి నుంచి బెల్జియన్ మాలినోయిస్ జాతి కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అంతేకాదు, అగ్రరాజ్యం అమెరికా.. శ్వేతసౌధం (వైట్ హౌజ్)నకు సెక్యూరిటీగా ఈ జాతి కుక్కలే ఉండటం విశేషం. ఎక్స్‌ప్లోజివ్స్‌ మెటీరియల్స్, నార్కోటిక్స్‌‌ను గుర్తించడంలోనూ ఈ డాగ్స్ ఉపయోగపడతాయి. రెండు అడుగుల లోపలున్న ఎక్స్‌ప్లోజన్స్‌ను కూడా ఇవి గుర్తించగలుగుతాయి. బాంబు పేలుళ్లకు, గన్ ఫైర్ శబ్దానికి గల భేదాన్ని కూడా గుర్తిస్తాయి. వీటికి మొత్తంగా 10 నెలలు శిక్షణ ఇస్తారు. వీటిని 2011లో నక్సల్స్‌ను గుర్తించడానికి ఇండియాలో తొలిసారిగా వాడారు. అంతేకాక కజిరంగా నేషనల్ పార్కులో పోచర్స్‌ను గుర్తించడానికి కూడా వీటిని ఉపయోగించారు.

సీఐఎస్ఎఫ్‌లో ప్రస్తుతం లాబ్రాడర్స్, జర్మన్ షెపర్డ్స్, కాకర్ స్పానియల్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు బెల్జియన్ మాలినోయిస్ కూడా ఆ గ్రూపులో భాగమయ్యాయి.



Next Story

Most Viewed