తెలంగాణలో మెడ్ ట్రానిక్స్ రూ.1200 కోట్ల పెట్టుబడి

by  |
తెలంగాణలో మెడ్ ట్రానిక్స్ రూ.1200 కోట్ల పెట్టుబడి
X

దిశ, న్యూస్‌బ్యూరో: మెడికల్ డివైస్ తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మెడ్ ట్రానిక్స్ తెలంగాణను తన పెట్టుబడి గమ్యస్థానంగా ఎంచుకుంది. తన రెండో అతిపెద్ద డెవలప్మెంట్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.1200 కోట్లతో కార్యకలాపాలను విస్తరించనుంది. ప్రస్తుత పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని మరింతగా విస్తరించనుంది. ఈ మెడ్ ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ అమెరికా అవతల అతిపెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ కానుంది. రానున్న ఐదేళ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ పెట్టుబడితో మెడికల్ డివైసెస్ హబ్ గా హైదరాబాద్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం, మెడ్ ట్రానిక్స్ కంపెనీలు రెండు సంవత్సరాలుగా చర్చలను కొనసాగిస్తున్నాయి.

2016లో అమెరికాలో పర్యటించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ బృందం సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఓమర్ ఇస్రాక్‌తో సమావేశమైంది. మంగళవారం ఆయనతో జరిగిన వర్చువల్ సమావేశంలో ఈ మేరకు పెట్టుబడికి సంబంధించిన ప్రకటనను జారీ చేశారు. పరిశోధన, అభివృద్ధి అనేది ఇన్నోవేషన్‌కి దారితీస్తుందని, ఇన్నోవేషన్ అనేది తమ కంపెనీ అభివృద్ధికి అత్యంత కీలకమైనదని కంపెనీ చైర్మన్ ఒమర్ ఇస్రాక్ ప్రకటించారు. ఈరోజు ప్రకటించిన పెట్టుబడి భారతదేశం పట్ల తమ కమిట్మెంట్‌కి, ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తాము తీసుకున్న నిర్ణయాన్ని సూచిస్తుందని తెలిపారు. రోగుల బాధను దూరంచేసి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలన్న తమ కంపెనీ లక్ష్యాలతో పాటు, ఆరోగ్య రంగాన్ని మరింతగా విస్తరించాలన్న ప్రభుత్వ లక్ష్యాల మేరకు ఈ భాగస్వామ్యం ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మెడికల్ డివైస్ రంగంలో అనేక చర్యలు

తెలంగాణలో మెడికల్ డివైస్ రంగంలో కొన్నేళ్లుగా అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు వర్చువల్ మీటింగ్‌లో మంత్రి కేటీఆర్ మెడ్ ట్రానిక్స్ కంపెనీకి వివరించారు. తన అమెరికా పర్యటనలో కంపెనీ ఛైర్మన్‌గా ఎంపికైన సందర్భంగా ఒమర్‌కు అభినందనలు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. దీంతోపాటు జెఫ్రీ .యస్. మార్తా కంపెనీ నూతన సీఈఓగా ఎంపికైనందుకు అభినందనలు తెలిపారు. మెడ్ ట్రానిక్స్ కంపెనీ హైదరాబాద్ నగరాన్ని తమ అతిపెద్ద ఆర్‌అండ్‌డి సెంటర్‌కి గమ్యస్థానం ఎంచుకోవడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనతో పాటు, మరిన్ని నూతన పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం మెడ్ ట్రానిక్స్ పెడుతున్న పెట్టుబడి హైదరాబాద్ నగరాన్ని భారతదేశ మెడికల్ డివైసెస్ హబ్ గా మారుస్తుందన్నారు.

దీర్ఘకాలిక రోగాలకు ఆవిష్కరణలు

దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న రోగులకు తమ కంపెనీ యొక్క ఆవిష్కరణ ద్వారా ఉపశమనం కల్పించాలన్న ఉద్దేశంతో కంపెనీ ఇన్నోవేషన్‌కి అధిక ప్రాధాన్యత ఇస్తుందని కంపెనీ యొక్క భారత ఉపఖండ ఉపాధ్యక్షుడు మదన్ కృష్ణ తెలిపారు. ప్రస్తుతం కంపెనీ కార్యకలాపాల విస్తరణ ద్వారా ఇక్కడి ఇంజనీరింగ్ విద్యార్థులు తమ మెడ్ ట్రానిక్స్ కంపెనీతో కలిసి పని చేసేందుకు వీలు కలుగుతుందని, తద్వారా హెల్త్‌కేర్ రంగంలో అనేక మార్పులకు కారణం అయ్యే అవకాశం ఉందన్నారు.


Next Story

Most Viewed