రైతన్నకు గుదిబండలా మారిన యాంత్రీకరణ

by  |
రైతన్నకు గుదిబండలా మారిన యాంత్రీకరణ
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఒకప్పుడు గ్రామాల్లో దాదాపుగా ప్రతి ఇంటికి ఎడ్లో.. బర్లో.. ఉండడం కామన్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పది పదిహేను ఇండ్లలోనూ ఒక్కటీ కానరాట్లేదు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో యాంత్రీకరణ పెరిగిపోవడం.. పశువులను మేపేందుకు మనుషుల్లేకపోవడం.. గతంలో లాగా జీతగాళ్లు దొరకకపోవడం వల్ల ఎడ్లు, బర్లు కనుమరుగయ్యాయి. దీంతో వ్యవసాయానికి యాంత్రీకరణ మొదట్లో బాగానే అబ్బింది. ఇప్పుడా యాంత్రీకరణే.. రైతాంగానికి పెద్ద గుదిబండలా మారింది. యాంత్రీకరణ మూలంగా పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిన నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతు ఇబ్బందులపై ‘దిశ’ ప్రత్యేక కథనం.

అన్నదాతలకు వానాకాలం పంటల సాగు కష్టాలు మొదలయ్యాయి. సకాలంలోనే మోస్తరు వర్షాలు కురిశాయి. రైతులంతా సాగుకోసం సన్నద్దమయ్యారు. ఇప్పటికే నాట్లు వేస్తున్నారు. కానీ ఆరంభంలోనే రైతులు సమస్యల వలయంలో చిక్కుకుపోయారు. వానాకాలం సాగు సీజనుకు సంబంధించి ఇప్పటివరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో రైతుల కండ్లలో ఆనందం కనబడుతోంది. దీంతో రైతన్నలు శక్తికిమించి వానాకాలం సాగుకు రెడీ అయ్యారు. కానీ పెరిగిన యాంత్రీకరణ వల్ల పెట్టుబడి భారం తడిసి మోపెడు అవుతోంది.

యంత్రాల వినియోగంతో పెరిగిన సాగు వ్యయం..

ఒకప్పుడు వ్యవసాయం అంటే నాగలి పట్టి ఎద్దులు కట్టి దుక్కి దున్ని విత్తనాలు వేసి పంటలను పండించేది. కానీ ప్రస్తుత రోజుల్లో అంతటా యంత్రాల మయం అయిపోయాయి. గతంలో రైతుల ఇంట తప్పనిసరిగా ఎడ్లు ఉండేవి. ప్రస్తుతం ఎటు చూసినా యంత్రాలే కనబడుతున్నాయి. దుక్కి దున్నడం మొదలు విత్తువేసిన దగ్గర నుంచి చివరకు పంట చేతికొచ్చే వరకు యంత్రాలనే వాడుతున్నారు. ఎక్కడ చూసినా రైతులు ట్రాక్టర్‌ యంత్రాలతోనే వ్యవసాయం చేస్తున్నారు.

దుక్కులు దున్నుడు మొదలు అన్ని పనులు యంత్రాలతోనే ఉండటంతో సాగు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయంటున్నారు రైతులు. దీంతో పంట ఏదైనా ఒక్క ఎకరా సాగుకు కనీసం రూ.30 నుంచి 40 వేల వరకు కర్చు అవుతుందని తెలిపారు. 5 ఎకరాల పొలం ఉన్న రైతు పెట్టుబడులు ఎలా పెట్టాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కనీసం తిండి గింజలు కూడా దొరక్క ఇబ్బందులు పడుతున్న రైతులు ఖరీఫ్‌ సాగు ఖర్చుల కోసం దొరికిన చోటల్లా అప్పులు చేస్తున్నారు.

ఎకరం నాటుకు 13 వేల ఖర్చు..

ఒక ఎకరానికి రూ.7,000 ట్రాక్టర్‌ కిరాయి, నాటు కూళ్లు గుత్తకిస్తే ఎకరానికి రూ.4500, ఒక ఎకరానికి డీఏపీ బస్తా రూ.1300, గట్టు చెక్కడానికి పార పని కూలి రూ.2000, ఇలా ఎకరానికి దాదాపుగా రూ.13 వేలకు అటూ ఇటూగా ఖర్చు వస్తోంది. మూడెకరాల పొలం చేస్తే దాదాపుగా రూ.40 వేల వరకు ఖర్చు వస్తోందని రైతులు చెప్తున్నారు. ఇదంతా కేవలం నాటు వేసే వరకు మాత్రమే. తర్వాత కలుపుతీత, కలుపు మందులు కొట్టడం తదితర ఖర్చులన్నీ అదనంగా మారడంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు.



Next Story