వాహన లీజింగ్ సేవల్లోకి మారుతీ సుజుకి

by  |
వాహన లీజింగ్ సేవల్లోకి మారుతీ సుజుకి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా తన వాహన లీజింగ్ సేవలైన ‘మారుతీ సుజుకి సబ్‌స్క్రైబ్’ను గురువారం ప్రారంభించినట్టు వెల్లడించింది. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతిన్న నేపథ్యంలో పలు మార్గాల్లో వెహికల్ ఓనర్‌షిప్ మోడళ్లకు ప్రచారం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనికోసం జపాన్‌కు చెందిన, దేశీయంగా ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఓరిక్స్ ఆటో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ లిమిటెడ్‌తో జత కట్టింది. ఈ సంస్థ వాహన లీజింగ్ సేవలను మార్కెట్లో ప్రారంభించనున్నట్టు కంపెనీ పేర్కొంది. పైలెట్ ప్రాజెక్టుగా బెంగళూరు, గురుగ్రామ్ నగరాల్లో కార్ల సబ్‌స్క్రిప్షన్‌ను మొదలుపెట్టనుంది. ఇందులో మారుతీ సుజుకి ఛానల్ నుంచి స్విఫ్ట్, డిజర్, విటారా బ్రెజా, ఎర్టిగా మోడళ్లను, నెక్సా ఛానల్ నుంచి బలేనో, సియజ్, ఎక్స్ఎల్ 6లను అందుబాటులో ఉంచనుంది. ఇదివరకే హ్యూండాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు ఈ వాహన లీజింగ్ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మారుతీ సుజుకి సైతం ఈ సేవల్లోకి ప్రవేశించింది.

అమెరికా, యూరప్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వాహన లీజింగ్ సేవలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇండియాలో గత రెండు సంవత్సరాలుగా ఈ సేవలు ఉన్నాయి. మారుతీ సుజుకి ఇంతకుముందు కార్పొరేట్‌ల కోసం వాహన లీజింగ్ సేవలను ప్రారంభించినప్పటికీ పెద్దగా విజయం సాధించలేదు. వాహన లీజింగ్ సేవలను స్టార్టప్‌లతో కలిసి హ్యూండాయ్, మహీంద్రా కంపెనీలు కొనసాగిస్తున్నాయి. 2018లో హ్యూండాయ్ రేవ్ అనే కంపెనీలో అప్రకటిత పెట్టుబడి పెట్టగా, మహీంద్రా.. జూమ్‌కార్ స్టార్టప్‌లో రూ. 176 కోట్ల పెట్టుబడులను పెట్టింది.


Next Story

Most Viewed