మావోయిస్టు అగ్రనేత ఆర్కే జస్ట్ మిస్!

by  |
మావోయిస్టు అగ్రనేత ఆర్కే జస్ట్ మిస్!
X

దిశ, వెబ్‌డెస్క్ :మావోయిస్టుల ఏరివేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వారి కదలికలు ఎక్కువ కావడంతో పాటు, కొన్ని రాష్ట్రాల్లో వారు సృష్టించిన విధ్వంసమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో పోలీసులు-మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ సమయంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే కొద్దిలో తప్పించుకున్నాడు. మరో అగ్రనేత, ఏవోబీ కార్యదర్శి చలపతి, ఆయన భార్య అరుణ తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఈ నెల 28 నుంచి అమర వీరుల వార్షికోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. వారంరోజుల కార్యక్రమాల రూపకల్పన కోసం ఒడిశాలోని మల్కనగిరి జిల్లా బెజ్జంగి అటవీ ప్రాంతంలో సమావేశమయ్యారు. ఇందులో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు, కీలక మిలీషియా సభ్యులు పాల్గొన్నట్లు పోలీసులకు టిప్ అందింది.

గాలింపు మొదలెట్టిన పోలీసులకు ఈ నెల 16న ముకుడుపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు కంటపడ్డారు. అప్రమత్తమైన మావోలు కాల్పులు ప్రారంభించారు. పోలీసులు కూడా కాల్పులు జరపడంతో మావోలు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఒడిశాలో తప్పించుకున్న మావోయిస్టులు ఇంజెరి అటవీ ప్రాంతంవైపు వెళ్తున్నట్లు విశాఖ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అడవిలో జల్లెడ పట్టారు.

ఇంజెరిలో మొత్తం మూడు బృందాలుగా 30మంది మావోయిస్టులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు చలపతి, అరుణ వంటి అగ్రనేతలు ఉన్న రెండో బృందంపై కాల్పులు జరిపారు. వారు పోలీసులపైకి కాల్పులు జరుపుతూ మరోమారు తప్పించుకుపోయారు. ఆ ప్రాంతాన్ని గాలించగా రక్తపు మరకలు, తుపాకి, ఇతర సామగ్రి కనిపించాయి. ఈ కాల్పుల్లో చలపతి, ఆయన భార్య అరుణ తీవ్రంగా గాయపడినట్టు పోలీసులకు ఆ తర్వాత తెలిసింది.

మూడో బృందంపైనా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ బృందంలో అగ్రనేత ఆర్కే ఉన్నట్టు సమాచారం. అయితే, ఆ సమయంలో భారీ వర్షం కురుస్తుండటం మావోలకు కలిసొచ్చింది. దీంతో వారు తప్పించుకోగలిగారు. లేదంటే భారీ ఎన్‌కౌంటర్ జరిగి ఉండేదని భావిస్తున్నారు. మరోవైపు, గాయపడిన చలపతి, అరుణ ఎక్కువ దూరం వెళ్లి ఉండే అవకాశం లేకపోవడంతో ఏపీ, ఒడిశా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.


Next Story

Most Viewed