మావోయిస్ట్.. జర్నలిస్ట్.. ఎమ్మెల్యే.. ఇది రామలింగారెడ్డి ప్రస్థానం

by  |
మావోయిస్ట్.. జర్నలిస్ట్.. ఎమ్మెల్యే.. ఇది రామలింగారెడ్డి ప్రస్థానం
X

దిశ, వెబ్‌డెస్క్: సోలిపేట రామలింగారెడ్డి. ఈ పేరుకు ఉమ్మడి మెదక్ జిల్లాలో పరిచయం అక్కరలేదు. విద్యార్థి జీవితం నుంచి ప్రజల పక్షాన్నే పోరాడుతున్న నాయకుడిగా పేరుంది. పౌర హక్కుల నేతగా.. మవోయిస్ట్ గా.. జర్నలిస్ట్ గా.. ఎమ్మెల్యేగా.. ఏది చేసిన ప్రజల కోసమే అన్నట్టుగా ఆయన ప్రస్థానం కొనసాగింది. ఆపదలో ఉన్న వారికి నేనున్నాను అంటూ పరుగెత్తే ఆయన అడుగులు ఆగిపోయాయి. ప్రజల గొంతుక మూగబోయింది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగరవేసిన దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అనారోగ్యంతో అశువులు బాశారు.

దుబ్బాక నియోజకవర్గంలోని చిట్టాపూర్‌కు చెందిన పోలీస్ పటేల్ సోలిపేట రామకృష్ణారెడ్డి, మాణిక్యమ్మ దంపతుల ఆరుగురు సంతానంలో రామలింగారెడ్డి ఆఖరు వాడు. తండ్రి పోలీస్ పటేల్ అయినా రాయలింగారెడ్డి విద్యార్థి దశలోనే ర్యాడికల్ విద్యార్థి సంఘంలో చేరాడు. అక్కడ పౌరహక్కుల సంఘంలో పని చేసి, మవోయిజం వైపు వెళ్లాడు. దళంలో చేరి కొన్నాళ్లు అజ్ఞాత జీవితం గడిపారు. 1985లో పీపుల్స్ వార్ ఆధ్వర్యంలో రామలింగారెడ్డి పెళ్లి చేసుకోగా దానికి కేసీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత దళం నుంచి బయటకు వచ్చి జర్నలిస్ట్ గా 25 ఏళ్లు పని చేశారు. ఆ సమయంలోనే తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్‌తో ఏర్పడిన పరిచయం రాజకీయాల వైపు మళ్లించింది. అలా 2001లో తెలంగాణ మలి ఉద్యమంలోకి రామలింగారెడ్డి అడుగుపెట్టారు.

జర్నలిస్ట్‌గా కొనసాగుతూనే తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్న రామలింగారెడ్డి 2004లో కేసీఆర్ దృష్టిలో పడ్డారు. ఆ సమయంలోనే ఆయనను టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ‘జర్నలిస్టులు అంటే నాకు చాలా గౌరవం.. నీ పనితీరు నచ్చింది. రాజకీయాల్లోకి రండి’అని కేసీఆర్ ఆహ్వానంతో ఆలోచనలో పడ్డిన రామలింగారెడ్డి జర్నలిస్టుగా కంటే… రాజకీయ నేతగా మరింత ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం వస్తుంది అనే సంకల్పంతో అక్కడి నుంచి ఆయన అడుగు రాజకీయాలవైపు పడింది.

తొలిసారి 2004లో అప్పటి దొమ్మాట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత నిర్వహించిన 2008 ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించారు. నాటి దొమ్మాట 2009 నియోజక వర్గ పునర్విభజనలో దుబ్బాకగా మారింది. 2009లో మహా కూటమి అభ్యర్థిగా దుబ్బాక నుంచి పోటీ చేశారు. అప్పటి వరుకు టీడీపీలో ఉన్న ఆయనకు సీటు రాకపోవడంతో కాంగ్రెస్ లోకి వెళ్లి చెరుకు ముత్యంరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మళ్లీ 2014, 2018 ఎన్నికల లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రామలింగారెడ్డికి కేసీఆర్.. శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. వరుసగా రెండోసారి శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఉద్యమ సమయంలో జైలుకెళ్లిన సోలిపేట మీద వందలాది కేసులు ఉండేవి. మవోయిస్టుగా ఉద్యమం చేస్తున్నసమయంలో ఆయనపై టాడా కేసు కూడా నమోదు అయింది.


Next Story

Most Viewed