కంఠాభరణంగా.. కమ్మని స్వీట్ గా ‘కరోనా’

by  |
కంఠాభరణంగా.. కమ్మని స్వీట్ గా ‘కరోనా’
X

దిశ వెబ్ డెస్క్ :

‘కరోనా’..‘కరోనా’ ఏ నోటా విన్నా ఈ పదమే. ఏ పాట విన్నా .. దాని అక్షరరూపమే. కరోనా ప్రజలను ఎంతగా భయపెడుతుందో వేరే చెప్పనవసరం లేదు. అయితే ఆ భయాన్ని తొలగించి… ధైర్యాన్ని నూరిపోయడానికి సినీ కవులంతా.. అక్షర యజ్ఞం చేస్తున్నారు. డాక్టర్లంతా పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్స్ కూడా మనలో ఆత్మ స్తైర్యాన్ని పెంచడానికి తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. వారి బాటలోనే ఓ డాక్టర్, ఓ స్వీట్ షాపు యజమాని కోవిడ్ ను జయించడానికి వినూత్నమైన ఆలోచనలతో మన ముందుకు వచ్చారు. రష్యాకు చెందిన డాక్టర్ వొరొబెవ్ కరోనా ఆకృతిలోని పెండెంట్ ను తయారు చేసింది. కరోనా పై విజయానికి ఇది గుర్తుగా నిలుస్తుందని తెలుపుతోంది. అలాగే కోల్ కతాలోని ఓ స్వీట్ షాప్ యజమాని ‘కరోనాను అరగించుకుంటాం.. కరోనాను జయిస్తాం’ అంటూ కరోనా ఆకారంలోని స్వీటును తయారు చేశాడు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టిస్తున్న కలవరం.. అంతా ఇంతా కాదు. అయితే ఈ ఆపత్కాలంలోనే ప్రజలకు ఎంతోమంది అండగా నిలుబడుతున్నారు. ప్రజల్లో నెలకొన్న భయాన్ని పొగొట్టడానికి పలు విధాల ప్రయత్నిస్తున్నారు. రష్యాకి చెందిన డాక్టర్ వోరొబెవ్.. స్వతహాగా మెడికల్ జ్యువెలరీ రూపొందిస్తుంది. వైద్య సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఆభరణాలు తయారు చేయడం ఈమె పని. ప్రస్తుత్తం ప్రపంచమంతా ‘కరోనా వైరస్’పై భయందోళనలు కొనసాగుతుండటంతో .. ఆ వైరస్ ఆకృతితోనే పెండెంట్ రూపొందించింది. ఒక్కో పెండెంట్ ధర 13 డాలర్లు. అయితే చాలా మంది వొరొబెవ్ చేస్తున్న ఈ పనికి విమర్శలు చేస్తున్నారు. దానికి వొరొబెవ్ గట్టిగానే సమాధానం ఇచ్చింది. ‘నేను తయారుచేసేది మెడికల్ జ్యువెలరీ. కరోనాపై డాక్టర్లు, ప్రజలు సాధిస్తున్న విజయానికి ఇది ప్రతీకగా నిలుస్తుంది. కరోనా నుంచి కోలుకున్న చాలా మంది.. వారికి వైద్యం అందించిన వైద్యులకు ఈ పెండెంట్ ను బహుమతిగా అందిస్తున్నారు’ అని చెప్పుకొచ్చింది. అయితే ఆమె కరోనా వైరస్ పైనే కాదు.. బ్యాక్టీరియా, డీఎన్ఏ వంటి వాటి ఆకృతిలోనూ పెండెంట్ లు తయారు చేసింది. ఆమె రూపొందించే ఆభరణాలన్నీ కూడా వెండి తోనే చేస్తుంది. వెండికి సూక్ష్మక్రిములను అడ్డుకునే తత్వం ఉంది.

తియ్యని కరోనా

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఓ స్వీట్ షాప్ యజమాని కరోనా వైరస్ ఆకారంలో ఉన్న స్వీట్స్‌, కేక్‌లను రూపొందిస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కల్పించడానికే ఈ‘యాంటీ కరోనా స్వీట్’లను తయారు చేశాడు. దీంతో ఆ దుకాణంలోకి వచ్చే కస్టమర్లు ఈ స్వీట్‌లను చూసి అవాక్కవుతున్నారు. షాపునకు వచ్చిన ప్రతి కస్టమర్ కు ఈ స్వీట్లను ఉచితంగా అందజేస్తూ.. కరోనా నివారణపై ప్రచారం చేస్తున్నాడు. కరోనా బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ఓ కరపత్రాన్ని కూడా అందిస్తున్నాడు. అంతేకాదు ‘మేం కరోనాను అరగించుకుంటాం.. కరోనాను ఓడిస్తాం’ అనే కోట్ ను కూడా జత చేసి, స్వీట్ ను అందిస్తున్నాడు. ‘పశ్చిమబెంగాల్ సందేశ్ స్వీట్లకు పెట్టింది పేరు. ఇక్కడి వారికి సందేశ్, కప్ కేక్స్ అంటే చాలా ఇష్టం. అందుకే స్వీట్, కేకులను కరోనా వైరస్ ఆకృతిలో తయారు చేసి అందిస్తున్నాం. ప్రజల్లో స్ఫూర్తి నింపడానే ఈ పని చేస్తున్నాను’ అని షాపు యజమాని రాబిన్ పాల్ తెలిపారు. ప్రస్తుతం స్వీటు కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్వీట్ షాపులకు అక్కడ సడలింపు :

లాక్‌డౌన్‌లోనూ బెంగాల్ ప్రభుత్వం మిఠాయి షాపులకు మినాయింపు ఇచ్చింది. మిఠాయి దుకాణాలను ప్రతీరోజు నాలుగు గంటలపాటు తెరిచి ఉంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ దుకాణాలు తెరిచి ఉంచుకోవచ్చని, కానీ సిబ్బంది సంఖ్య మాత్రం పరిమితంగా ఉండేలా చూసుకోవడంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Tags: corona virus, covid 19, lockdown, sweet, sandesh, cupcakes, kolkata, pendent


Next Story