శ్రీలంక ప్రధానిగా రాజపక్స బాధ్యతల స్వీకరణ

by  |
శ్రీలంక ప్రధానిగా రాజపక్స బాధ్యతల స్వీకరణ
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీలంకలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మహింద రాజపక్స ఆదివారం ఉదయం ఆదేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. కొలంబో శివారులోని కేలానియాలో గల చారిత్ర‌క బౌద్ధ ఆల‌యంలో ఆయ‌న త‌మ్ముడు, రాష్ట్రపతి గోట‌బ‌య రాజ‌పక్స‌ మహింద రాజపక్సతో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఈనెల 5న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రాజ‌పక్స‌ నేతృత్వంలోని శ్రీల‌ంక పీపుల్స్ పార్టీ (ఎస్ఎల్పీపీ) ఘ‌న‌ విజ‌యం సాధించింది. మొత్తం 225 సీట్లున్న పార్ల‌మెంటులో ఆ పార్టీ సొంతంగా 145 స్థానాల్లో విజ‌యం ఢంకా మోగించింది. మిత్ర‌ ప‌క్షాల‌తో క‌లిపి ఆ పార్టి మెజార్టీ 150కు చేరింది.

ఈసారి ఎన్నికల్లో రాజ‌ప‌క్స 5 ల‌క్ష‌ల వ్య‌క్తిగ‌త ఓట్ల‌ను సాధించి రికార్టు సృష్టించారు. ఆదేశ ఎన్నికల చ‌రిత్ర‌లో ఇంత భారీ స‌ఖ్య‌లో ఓట్ల‌ు రావడం ఇదే మొద‌టిసారి కావడం విశేషం. తన రాజ‌కీయ ప్ర‌స్థానంలో రాజపక్స 50 ఏండ్లు పూర్తిచేసుకున్నారు. ఆయ‌న మొద‌టిసారిగా 1970లో త‌న 24 ఏటా పార్ల‌మెంటులో అడుగుపెట్టారు. అప్ప‌టినుంచి 2సార్లు రాష్ట్రపతిగా, 3సార్లు ప్ర‌ధానిగా నియ‌మితుల‌య్యారు. 2005 నుంచి 2015 వ‌ర‌కు ప‌దేండ్ల పాటు శ్రీలంక అధ్య‌క్షుడిగా ప‌నిచేశారు. మ‌హింద రాజ‌పక్స‌ త‌మ్ముడు గోట‌బ‌య రాజ‌ప‌క్స గ‌త న‌వంబ‌ర్‌లో జ‌రిగిన అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఎస్ఎల్సీపీ అభ్య‌ర్థిగా పోటీచేసి విజ‌యం సాధించారు. ఆ తర్వాత ఆదేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆయన అన్న ప్రధాని కావడంతో సోదరులు శ్రీలంకను పాలించనున్నారు.


Next Story

Most Viewed