ఆ హత్య చేసింది లవర్సేే

by  |
ఆ హత్య చేసింది లవర్సేే
X

దిశ, ఏపీబ్యూరో : విశాఖ గాజువాక పరిసరాల్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు అసలు నిందితులను గుర్తించారు. విచారణలో వారిద్దరూ ప్రేమికులు అని తేలింది. సీపీ ఆర్కేమీనా కథనం ప్రకారం..గాజువాక గుడివాడ అప్పన్నకాలనీకి చెందిన గుర్రం గణేశ్‌(38), మల్కాపురం హనుమాన్‌గుడి సమీపంలో నివాసముంటున్నగుంటు దీనా అలియాస్‌ స్వాతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా నిత్యం వేధించేవాడు. ఈ విషయాన్ని స్వాతి తన ప్రియుడు గుడివాడ అప్పన్న కాలనీకి చెందిన గర్రాల జోగారావుకు తెలిపింది. తీరు మార్చుకోవాలంటూ జోగారావు పలుమార్లు గణేశ్‌ను హెచ్చరించాడు. అయినా ఏ మార్పులేదు దీంతో ప్రేమికులిద్దరూ కలిసి పథకం ప్రకారం గణేశ్‌ను ఈ నెల 5న గ్లోబెక్స్‌ షాపింగ్‌మాల్‌ వెనుక పాడుబడిన చేపల కంపెనీ వద్దకు రప్పించారు. ఆ తర్వాత అతనికి పూటుగా మడ్డికల్లు తాగించారు. మత్తులోకి జారుకున్నాక గణేశ్‌ కాళ్లు, చేతులు కట్టేయగా, స్వాతి కర్రతో గణేశ్ తలపై బలంగా మోదింది.

జోగారావు.. గణేశ్‌ ప్యాంటు బెల్టు తీసి, అతని మెడకు బిగించి హత్య చేశాడు. మృతదేహాన్ని పక్కనే ఉన్న కాలువలోకి తోసేసి ఇద్దరూ వెళ్లిపోయారు. రెండ్రోజుల తర్వాత మళ్లీ వచ్చి మృతదేహంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఈ నెల 13న కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందంటూ గుడివాడ అప్పన్నకాలనీ వీఆర్‌ఓ ఎ.కార్తీక్‌ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అక్కడ లభించిన చైన్‌, చేతి కడియం ఆధారంగా పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాకబు చేశారు. ఇవి గుడివాడ అప్పన్నకాలనీకి చెందిన గర్రం గణేశ్‌విగా అతని తల్లిదండ్రులు గుర్తించారు. అప్పుడప్పుడు పది, పదిహేను రోజులపాటు ఎక్కడికోవెళ్లి వస్తుంటాడని, ఇప్పుడూ అలాగే వెళ్లి వుంటాడన్న భావనతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తల్లిదండ్రులు చెప్పారు. గణేశ్‌కు ఉన్న శత్రువులు, ఇటీవల జరిగిన వివాదాల గురించి పోలీసులు ఆరా తీయగా జోగారావు, స్వాతి విషయం బయటపడింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.


Next Story