వాటికే దిక్కులేదు.. కొత్తగా ఎందుకు?

by  |
వాటికే దిక్కులేదు.. కొత్తగా ఎందుకు?
X

దిశ, వరంగల్ సిటీ: మరోసారి ఎల్ఆర్ఎస్ అవకాశం కల్పిస్తూ రాష్ర్ట ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2016లోనే అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. కానీ నాలుగేళ్ల క్రితం చేసుకున్న దరఖాస్తులకే నేటికీ మోక్షం లభించక దరఖాస్తు దారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుండగా.. నేడు కొత్తగా మళ్లీ ఎందుకు ఎల్ఆర్ఎస్ అవకాశం కల్పించారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

గతంలో వాటికే స్పందన లేదు..

2016లో ప్రభుత్వం జారీ చేసిన ఎల్ఆర్‌ ఎస్ స్కీంలో భాగంగా కుడా పరిధిలో దాదాపు 10 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 8 వేల దరఖాస్తుకు ఇప్పటికీ రెగ్యులరైజేషన్ సర్టిఫికెట్ అందలేదు. దరఖాస్తు దారులు నాలుగేళ్లుగా కుడా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా రు. అప్పుడే దరఖాస్తు చేసుకున్న వాటికే అతీగతీ లేదని విమర్శిస్తున్నారు.

ఖజానా కోసమే..

ఆదాయాన్ని సమకూర్చుకునేందుకే ఎల్ఆర్ఎస్ స్కీం మళ్లీ ప్రవేశ పెట్టారని పలువురు విమర్శిస్తున్నారు. ఇటీవల రాష్ర్ట ప్రభుత్వం నిర్వహించిన పట్టణ ప్రగతిలో సేకరించిన వివరాల ప్రకారం పట్టణాల చుట్టు పక్కల అక్రమ లేఅవుట్లు ఉన్నాయని తేలింది. దీంతో నిధుల అన్వేషణ చేస్తున్న ప్రభుత్వానికి సరిగ్గా ఎల్ఆర్ఎస్ ఒక ఆదాయ వనరుగా మారింది.

కబ్జాదారులకు హక్కు కల్పిస్తారా?

ఇటీవల వరంగల్ నగరం భారీ వర్షాలకు అతలాకుతలం అయింది. అయితే నాలాలు కబ్జాకు గురవడం, చెరువుల ఆక్రమణలే ప్రధాన కారణమని తేలింది. నాలాలపై ఇప్పటికే దాదాపు 900 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. వాటిలో 400 ఆక్రమణలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు తేలింది. అయితే వారిపై చర్యలు తీసుకునేందుకు బల్దియా, రెవెన్యూ అధికారులు తంటాలు పడుతుంటే మళ్లీ ఎల్ఆర్ఎస్ స్కీంను ప్రకటించడంపై అక్రమార్కులకు తిరిగి అవకాశం కల్పించినట్లు అవుతుందని నగరవాసులు వాపోతున్నారు. ప్రభుత్వ ద్వంద విధానాలతో నగరవాసులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరో ఆరునెల్లో జీడబ్ల్యూఎంసీ ఎన్నికలు ఉన్నందున ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకే ఎల్ఆర్ఎస్ స్కీంను అమలు చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

గజానికి రూ.750..

2008లో మొదటిసారి ఎల్ఆర్ఎస్ స్కీంను ప్రవేశపెట్టినప్పుడు వెయ్యి గజాలలోపు ఉన్న ప్లాటుకు ప్రభుత్వం గజానికి కేవలం 15 రూపాయలనే ధరగా నిర్ణయించింది. కానీ నేడు వెయ్యి గజాలలోపు ఉన్న ప్లాటును రెగ్యులరైజ్ చేసుకోవాలనుకునే వారు గజానికి రూ. 750 చెల్లించాలని నిర్ణయించింది. దీంతో దరఖాస్తుదారులపై అధిక భారం పడనుంది.

అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి ఎల్ఆర్ఎస్ స్కీంను ప్రకటించిన సందర్భంలో 75 గజాలలోపు ఎలాంటి అనుమతులు అవసరం లేదని ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించారు. అయితే ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌లో మాత్రం 100 గజాలలోపు ప్లాట్లు ఉన్నవారు కూడా ఎల్ఆర్ఎస్ కోసం గజానికి రూ. 200 చెల్లించాలనే నిబంధనలను విధించడంతో పేదవారికీ భారంగా మారనుంది. గ్రామాల పరిధిలో వాటికి ఎల్ఆర్ఎస్ తప్పనిసరి చేయడంతో గ్రామాల పరిధిలో భూములు కొన్నవారికీ ఆర్థిక ఇబ్బందులు ఎదురుకానున్నాయి.


Next Story

Most Viewed