మద్యం తాగి బావిలోకి దిగి… శవమై తేలాడు

by  |
మద్యం తాగి బావిలోకి దిగి… శవమై తేలాడు
X

దిశ, డోర్నకల్: వ్యవసాయబావిలో పడి ఓ వ్యక్తి అనుమానా స్పదంగా మృతిచెందాడు. ఈ ఘటన చిన్నగూడూరు మండలంలోని విస్సంపల్లి గ్రామశివారు తుమ్మల చెరువు తండాలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… తుమ్మల చెరువు తండాకు చెందిన గుగులోతు కిషన్(45) వృత్తిరీత్యా మెకానిక్. అదే తండాకు చెందిన భూక్య రాము తన వ్యవసాయ బావిలో నీట మునిగిన మోటార్ చెడిపోవడంతో రెండ్రోజుల క్రితం మెకానిక్ కిషన్‌ను సంప్రదించాడు. అనంతరం ఇరువురు మద్యం తాగారు. మందు సేవించిన మైకంలో బావిలోకి దిగిన కిషన్ నీటిలో మునిగిపోయాడు.

ఈ విషయాన్ని బావి యజమాని రాము దాచిపెట్టి ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం కిషన్ బావిలో శవమై తేలడంతో భయాందోళనకు గురైన రాము తాడు సహాయంతో మృతదేహాన్ని పైకి తీసి బావి పక్కన కుంటలో వేసి వెళ్లిపోయాడు. కుంటలో నుంచి దుర్వాసన రావడంతో స్థానిక రైతులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ఎం కరుణాకర్, ఎస్సై విజయ్ కుమార్‌లు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కిషన్ మృతికి కారణమైన రాముపై చర్యలు తీసుకోవాలని తండా వాసులు పోలీసులతో వాగ్వాదం చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


Next Story