రూ. 60 లక్షలు పలికిన లింకన్ వెంట్రుకలు

by  |
రూ. 60 లక్షలు పలికిన లింకన్ వెంట్రుకలు
X

దిశ, వెబ్‌డెస్క్: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు పదహారవ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన అబ్రహం లింకన్ వెంట్రుకల గుత్తి, అలాగే 1865లో అతని హత్య గురించి రాసిన ఓ రక్తపు మరకలు గల టెలిగ్రామ్‌ను శనివారం రోజున బోస్టన్‌లో వేలం వేశారు. ఈ రెండూ కలిపి 81వేల అమెరికన్ డాలర్లు అంటే దాదాపు రూ. 60 లక్షలకు అమ్ముడుపోయినట్లు తెలిసింది. అయితే కొన్నది ఎవరనే విషయం మాత్రం తెలియరాలేదు. ఒక్కో వెంట్రుక రెండు ఇంచుల పొడవుతో ఉన్నాయి. వాషింగ్టన్ డి.సి.లోని ఫోర్డ్ థియేటర్ వద్ద జాన్ విల్కీస్ బూత్ చేతిలో లింకన్ దారుణంగా హత్యకు గురయ్యారు. ఆయన శరీరాన్ని పోస్ట్‌మార్టం చేసినపుడు ఈ జుట్టును తీశారు.

ఆ తీసిన వెంట్రుకల గుత్తిని లింకన్ భార్య మేరీ టాడ్ కజిన్ అయిన డాక్టర్ లైమన్ బీచర్ టాడ్‌కు బహుకరించారు. లింకన్ శరీరాన్ని పోస్టుమార్టమ్ చేస్తున్నపుడు బీచర్ అక్కడే ఉన్నాడు. ఈ జుట్టుతో పాటు వార్ డిపార్ట్‌మెంట్ టెలీగ్రామ్‌ను కూడా టాడ్‌కు బహుకరించారు. తర్వాత ఈ జుట్టును, టెలీగ్రామ్‌ను డాక్టర్ టాడ్ కుమారుడు జేమ్స్ టాడ్ తన స్వహస్తాలతో ఆర్ఆర్ ఆక్షన్ సంస్థకు అందించాడు. ఇవి రెండూ కలిసి 75వేల డాలర్లకు అమ్ముడుపోతాయనుకుంటే దాదాపు 81వేల డాలర్లు ధర పలకడం నిజంగా ఆనందంగా ఉందని ఆర్ఆర్ ఆక్షన్ ఎగ్జిక్యూటివ్ బాబీ లివింగ్‌స్టన్ తెలిపారు.

Read Also…

బిహార్‌లో మరో మాంఝీ..


Next Story

Most Viewed