మహా కుంభమేళాకు వెళ్తున్నారా.. అయితే ఈ ప్రదేశాలను అస్సలు మిస్సవ్వకండి!

by D.Reddy |   ( Updated:2025-01-20 09:09:39.0  )
మహా కుంభమేళాకు వెళ్తున్నారా.. అయితే ఈ ప్రదేశాలను అస్సలు మిస్సవ్వకండి!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభ మేళా జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. కేవలం భారతీయులే కాదు వివిధ దేశాల నుంచి కూడా పర్యాటకులు ఈ కుంభమేళాకు తరలివస్తున్నారు. ఇక మీరు కూడా ఈ కుంభమేళాకు వెళ్లి పవ్రితమైన గంగ, యమున, సరస్వతి కలిసే త్రివేణి సంగమంలో స్నానమాచరించాలని అనుకుంటున్నారా? అయితే కుంభమేళాతో పాటు ప్రయాగ్‌రాజ్ సమీపంలో త ప్పక సందర్శించాల్సిన చారిత్రక ప్రదేశాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

బడే హనుమాన్ ఆలయం

గంగా-యమునా నదుల ఒడ్డున నిర్మించిన పురాతనమైన ఆలయం ఇది. ఇక్కడ ఆంజనేయస్వామి స్వయంభుగా వెలిసాడని స్థల పురాణం చెబుతుంది. ముఖ్యంగా ఈ ఆలయంలో చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే.. హనుమంతుడు శయన భంగిమలో భక్తులకు దర్శనమిస్తాడు. త్రివేణీ సంగమంలో స్నానం చేసిన తర్వాత తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి.

ఆనంద్‌ భవన్‌

ఇది మన దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పూర్వీకుల నివాసం. పురాతన కట్టడాలను ఇష్టపడే వారు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. ఈ భవనంలోనే నెహ్రూ తన బాల్యాన్ని గడిపారు. దీనిని ఇప్పుడు మ్యూజియంగా మార్చి నెహ్రూ కుటుంబానికి చెందిన ఫోటోలు, వ్యక్తిగత వస్తువులను పర్యాటకుల సందర్శన కోసం ఉంచారు. అంతేకాదు, భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రకు సంబంధించిన అనేక విషయాలను ఇక్కడ చూడవచ్చు.

అలహాబాద్‌ కోట

ఈ కోట సంగం నది ఒడ్డున ఉంటుంది. దీనిని 16వ శతాబ్ధంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ నిర్మించాడు. ఈ కోటలో అద్భుతమైన పర్షియన్, మొఘల్ వాస్తుశిల్పి నైపుణ్యాన్ని సందర్శించవచ్చు. అలాగే అశోక స్తంభం, పలు చారిత్రక శాసనాలు, పాటల్‌పురి ఆలయం, అక్షయ మర్రి చెట్టును ఈ కోటలో చూడవచ్చు.

చంద్రశేఖర్‌ ఆజాద్‌ పార్క్‌

ఈ పార్కులో స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహం ఉంటుంది. ఆజాద్ బ్రిటీష్ వారితో పోరాడుతూ ఇక్కడే వీరమరణం పొందారు. పిల్లలతో వెళ్లితే ఈ ప్రదేశాన్ని తప్పకుండా సందర్శించండి.

ఖుస్రో బాగ్‌

మొఘల్ కాలంలో నిర్మించిన ఖుస్రో బాగ్‌లో 40 ఎకరాల్లో చక్రవర్తి జహంగీర్, షా బేగం కుమారుడు సమాధులు ఉంటాయి. ఈ సమాధులు చుట్టూ అందమైన పూల తోటలతో చూడటానికి అద్భుతమైన శిల్పకళానైపుణ్యంతో ఉంటాయి.

ఇంతకీ ఎలా వెళ్లాలి?

తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రయాగ్ రాజ్‌కు వెళ్లడానికి భారతీయ రైల్వే ప్రతి రోజు ఒక రైలు(దానాపూర్ ఎక్స్‌ప్రెస్)ను సికింద్రాబాద్ నుంచి అందుబాటులో ఉంచింది. ఈ రైలు ప్రయాగ్‌రాజ్, ప్రయాగ్‌రాజ్ రాంబాగ్ రెండు స్టేషన్లలో ఆగుతుంది. ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు 25 గంటల సమయం పడుతుంది. అయితే కుంభమేళా నేపథ్యంలో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా 1225 ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది.

Next Story