‘తెలంగాణ ఉద్యమ తరహాలో.. భవిష్యత్తులో మరో ఉద్యమం’

by  |
‘తెలంగాణ ఉద్యమ తరహాలో.. భవిష్యత్తులో మరో ఉద్యమం’
X

దిశ, మహబూబ్‌నగర్: దక్షిణ తెలంగాణ ప్రజల నీటి గోస తీరాలంటే కృష్ణానదిపై ప్రతిపాదిత పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పల్లె రవికుమార్ అన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం తెలంగాణ ఉద్యమ తరహాలో భవిష్యత్తులో మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా జలాలను అక్రమంగా రాయలసీమకు తరలించుకుపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునే పరిస్థితి లేదన్నారు. సాగునీటి రంగంలో ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం జరిగిన జర్నలిస్టుల కార్యక్రమానికి పల్లె రవికుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన 25 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికీ 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టులకు టీ.జర్నలిస్టుల ఫోరం అండగా నిలబడిందని అన్నారు. ఇప్పటికే అనేక చోట్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు, తోచిన సాయం చేస్తున్నట్టు చెప్పారు. నిత్యం సమాజం కోసం పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వయసు పైబడిన జర్నలిస్టులను యాజమాన్యాలు వదిలించుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజ హితం కోసం పని చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక ముందు పదేళ్ల సర్వీస్ కలిగిన ప్రతి జర్నలిస్టుకీ ప్రభుత్వం.10 వేల పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. ఈ విషయం గురించి ప్రభుత్వంపై పోరాడాల్సిన బాధ్యత జర్నలిస్టు సంఘాలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed