నంది రాజకీయ ప్రస్థానం ఇదీ

by  |
నంది రాజకీయ ప్రస్థానం ఇదీ
X

దిశ ఫ్రతినిది, మెదక్: మాజీ ఎంపీ, మాజీ రాజ్యసభ సభ్యుడు నంది ఎల్లయ్య అనారోగ్యంతో నిమ్స్ లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. నంది ఎల్లయ్య ఆరు సార్లు ఎంపీగా, ఒక సారి రాజ్యసభ సభ్యునిగా పని చేశారు. సిద్ధిపేట ఎంపీగా ఐదు సార్లు, ఒక సారి మహబూబ్ నగర్ ఎంపీగా పని చేశారు. సిద్ధిపేట నుంచి 1977 లో మొదటి సారి సిద్ధిపేట (ఎస్సీ) లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పటి వరకు సిద్ధిపేట ఎంపీగా పని చేసిన జీ. వెంకటస్వామి శాసనమండలికి వెళ్లి పౌరసరఫరాల శాఖామంత్రిగా పని చేశారు.

వెంకటస్వామి రాజీనామాతో సిద్ధిపేట పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నంది ఎల్లయ్య పోటీ చేసి గెలిచారు. 1980లో జనతా ప్రభుత్వం కూలిపోవడంతో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి నంది ఎల్లయ్య సిద్ధిపేట నుంచి గెలుపొందారు. 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి డాక్టర్ గుండె విజయరామారావు చేతిలో నంది ఎల్లయ్య ఓడిపోయారు. తిరిగి 1989లో విజయరామమారావును ఓడించి మూడవ సారి విజయం సాధించారు నంది ఎల్లయ్య. ఎన్టీఆర్ ఛైర్మన్ గా వ్యవహరించిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కూలిపోవడంతో 1991లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నంది ఎల్లయ్య నాలుగవ సారి గెలిచారు. 1996లో మెజారిటీ లేక పోవడంతో అప్పటి ప్రధాని వాజ్ పాయ్ తన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు.

అప్పుడు జరిగిన ఎన్నికల్లో నంది ఎల్లయ్య ఐదవ సారి గెలిచారు. 1998లో వాజ్ పాయ్ ప్రభుత్వం మళ్లీ పడిపోవడంతో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మల్యాల రాజయ్య చేతిలో ఓటమి పాలయ్యారు నంది ఎల్లయ్య. మొదటి నుంచి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ముఖ్య అనుచరుడిగా కొనసాగారు నంది ఎల్లయ్య. ఒక సారి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పోరేటర్ గా కూడా పని చేశారు. 1941 జూలై 1న జన్మించారు.


Next Story

Most Viewed