ఐటీపై స్ట్రాటజీ గ్రూపు ఏర్పాటు చేయండి

by Shyam |

దిశ, హైదరాబాద్: దేశంలో ఐటీ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులపై పారిశ్రామిక వేత్తలు, నిపుణులతో జాతీయ స్థాయిలో ఒక స్ట్రాటజీ గ్రూపును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ దేశంలోని అన్ని రాష్ట్రాల ఐటీ మంత్రులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేటీఆర్ మాట్లాడారు. ఫార్మా, బయోటెక్నాలజీ, ఐటీ రంగాల కన్వర్జెన్స్ వల్ల అనేక నూతన అవకాశాలు రానున్నాయని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న రెండు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు(ఈఎంసీ) నిండినందున మరో రెండు ఈఎంసీలను కేటాయించాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ కోరారు. వర్క్ ఫ్రం హోమ్ ట్రెండ్ వల్ల ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో సైబర్ అటాక్స్ జరగకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. సైబర్ సెక్యూరిటీ రంగం ముందు ముందు వేగంగా వృద్ధి చెందనుందని, ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయన్నారు. చైనా నుంచి ఐటీ కంపెనీలు తరలిపోతున్నాయన్న వార్తలు వస్తున్నందున అవి భారత్‌కు వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు కదలాలని సూచించారు. కాగా, మంత్రి కేటీఆర్ చేసిన పలు సూచనలపై ఈ సమావేశంలో రవిశంకర్‌ప్రసాద్ సానుకూలంగా స్పందించారు.

Tags : telangana, it, crisis, ktr, central ministrer, ravishankar prasad, vedio conference

Next Story

Most Viewed