కేఆర్ఎంబీ మీటింగ్ షురూ.. రజత్ కుమార్ ఏమన్నారంటే..!

by Shyam |
కేఆర్ఎంబీ మీటింగ్ షురూ.. రజత్ కుమార్ ఏమన్నారంటే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం మొదలైంది. వచ్చేనెలలో బోర్డుల పరిధిని ఖరారు అమలు కానున్న నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది. ఉదయం కేఆర్‌ఎంబీ మీటింగ్ మొదలుకాగా.. సాయంత్రం 4 గంటలకు కేఆర్ఎంబీ, జీఆర్‌ఎంబీ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. కాగా, కేఆర్‌ఎంబీ సమావేశానికి ప్రారంభం ముందు రాష్ట్ర ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్​ మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని, నీటి వివాదాల్లో నెలకొన్న అంశాలపై బుధవారం నిర్వహించబోయే సమావేశంలో తెలంగాణ తరుఫున వాదనలు గట్టిగా వినిపిస్తామని తెలిపారు.

తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం జరిగిందని, తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం ప్రశ్నిస్తామన్నారు. కృష్ణా బేసిన్ నుంచి ఏపీ తరలిస్తున్న నీటిపై ముందు నుంచీ తెలంగాణ తరుఫున అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అక్రమమని, దీనిపై కేఆర్ఎంబీ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని రజత్​కుమార్​విమర్శించారు. తెలంగాణ జనాభా పెరుగుతోందని, అలాగే కృష్ణా బేసిన్ పరిధిలో తెలంగాణలో పెద్ద పరిశ్రమలు స్థాపిస్తున్నారని, నీటి వాటా కచ్చితంగా పెంచాలన్నారు. టెలీమెట్రీల విషయంలో కేఆర్ఎంబీ బాధ్యతా రాహిత్యంగా వ్యహరిస్తోందని, ఎక్కడి నుంచి నీళ్లు వెళ్తున్నాయో పూర్తిగా తెలిసినా నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ పదే పదే బోర్డులకు లేఖలు రాసి వేధిస్తున్నారని, కానీ అక్రమ ప్రాజెక్టులను ఏపీ నిర్మాణం చేస్తుందని రజత్ కుమార్​ఆరోపించారు. ఈ అంశాలన్నింటిపైనా సమావేశంలో వాదిస్తామని వెల్లడించారు.

Next Story

Most Viewed