ఉత్తమ సీఎంలలో కేసీఆర్ స్థానం మరింత కిందికి

by  |
ఉత్తమ సీఎంలలో కేసీఆర్ స్థానం మరింత కిందికి
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఢిల్లీకి చెందిన ఒక రీసెర్చి సంస్థతో కలిసి ఇండియా టుడే సంస్థ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేవలం 3% ఓట్లు మాత్రమే లభించాయి. ఉత్తమ సీఎంగా యోగి ఆదిత్యనాధ్‌కి ఏకంగా 24% ఓట్లు లభిస్తే, ఆ తర్వాతి వరుసలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (15%), ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ (11%), పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ (9%) చొప్పున మొదటి వరుసలో ఉన్నారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం కేవలం 3% ఓట్లతో కింది నుంచి ఆరవ స్థానంలో ఉన్నారు. మొదటి ఏడు స్థానాల్లో ఉత్తన సీఎంలుగా నిలిచినవారిలో ఒక్కరు మినహా మిగిలినవారంతా బీజేపీయేతర పార్టీలకు చెందినవారే. యూపీ సీఎం యోగికి జనవరిలో నిర్వహించిన సర్వే కంటే ఈసారి మరిన్ని ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇటీవలి కాలంలో కిడ్నాప్‌లు, హత్యలు లాంటి నేరాలు జరిగినా ఆయనకే ఎక్కువ మంది మద్దతు పలికారు.

దేశవ్యాప్తంగా 19రాష్ట్రాల్లోని 97పార్లమెంటు నియోజకవర్గాలు, 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూలై 15 నుంచి 27వ తేదీ వరకు మొత్తం 14రోజుల పాటు సర్వే నిర్వహించి 12,021 మంది నుంచి అభిప్రాయాలను సేకరించింది. ప్రధాని పనితీరు ఎలా ఉంది, అన్నింటికంటే అస్తవ్యస్తమైన విధానమేంటి, నచ్చిన పాలసీ ఏంటి… ఇలా అనేక అంశాల్లో ఈ సర్వే కోసం ప్రశ్నావళి రూపొందించింది. గతంలో ఇండియా టుడే సహా అనేక సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఉత్తమ సీఎంగా కేసీఆర్‌కు చాలా మంది మద్దతు పలికారు. తొలి ఐదు స్థానాల్లో ఒకరిగా నిలిచారు. కానీ ఈ ఏడాది జనవరిలో జరిగిన సర్వేలోనూ, ఇప్పుడు జూలైలో జరిగిన సర్వేలోనూ ఆయన ప్రతిష్ట అడుగుకు పడిపోయింది. కింది నుంచి ఆరవ స్థానంలో నిలిచారు. కేవలం 3శాతం మంది మాత్రమే ఆయన పనితీరును, ప్రజాదరణను మెచ్చుకున్నారు. రాజస్థాన్, కర్నాటక, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల సీఎంలు మరింత అధ్వాన్నంగా ఉన్నట్లు ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈ ఐదుగురికీ తలా రెండు శాతం మంది చొప్పున మద్దతు పలికారు. బీహార్ సీఎం నితీష్ కుమార్‌, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేకు తలా 7%, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు 6% చొప్పున ప్రజలు మద్దతు పలికారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌తో పోలిస్తే కేసీఆర్ ఎనిమిది పాయింట్లు తక్కువతో కింది స్థానాల్లో ఉన్నారు.


Next Story

Most Viewed