- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కవిత ఈజ్ బ్యాక్.. అన్నకు పోటీగా కొత్త టీమ్

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్లో మరో టీం రెడీ అయింది. ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాకే పరిమితమైన మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవిత టీం ఇప్పుడు రాష్ట్రమంతా దూకుడు పెంచాలని భావిస్తోంది. ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా కవితకు చెందిన ప్రతి అంశాన్ని వైరల్ చేయనున్నారు. కవిత సోదరుడు, మంత్రి కేటీఆర్ తరహాలోనే సోషల్ మీడియాను ప్రధానంగా వాడుకునేందుకు థర్డ్ టీం రెడీ అవుతోంది. దీనికోసం 25 మందితో ఒక బృందాన్ని సిద్ధం చేశారు.
స్పీడప్
కొద్దిరోజుల నుంచి వార్తల్లో, సోషల్ మీడియాలో కవిత వెనకబడ్డారు. ఒక విధంగా రాజకీయాల్లోనే కవిత నెమ్మదించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ పరిణామాల తర్వాత కవితకు స్థానిక సంస్థల మండలి తరపున మళ్లీ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు నిజామాబాద్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరిణామాల తర్వాత కవిత వర్గంలో కొంత ఊపు వచ్చింది. వాస్తవంగా కొన్ని సంఘాలకు, యువజన సంఘాలకు కవిత గౌరవాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇటీవల సింగరేణిలో టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా మళ్లీ ఎన్నుకున్నట్లు ఆ సంఘం ప్రకటించింది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్, సిబ్బంది యూనియన్, సెర్ప్ ఉద్యోగుల సంఘం వంటి సంఘాలకు గతంలో కవిత గౌరవాధ్యక్షురాలిగా ఉన్నా.. దాదాపు ఏడాదిన్నర కిందట నుంచి పెద్దగా యాక్టివ్గా లేరు.
ప్రస్తుతం ఈ సంఘాలు మళ్లీ కవిత పేరుతో కార్యక్రమాలను మొదలుపెట్టాయి. ఇటీవల సెర్ప్ ఉద్యోగుల సంఘం కవితను కలిసి మళ్లీ ఆ సంఘానికి నాయకత్వం వహించాలని కోరారు. అంతేకాకుండా ఇటీవల వారికి పీఆర్సీ అంశంలో కవిత చేసిన ప్రయత్నమే అంటూ ప్రచారం చేశారు. తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నిక తర్వాత నుంచి సోషల్ మీడియాలో దూకుడు పెంచారు.
25 మంది అదే పని..!
దీనికితోడుగా సోషల్ మీడియా కవిత టీం కూడా మళ్లీ యాక్టివ్గా మారింది. ప్రస్తుతం ఎలాంటి సంఘటనలు, శుభాకాంక్షలు వంటి వాటిని ఎక్కువగా వైరల్ చేసుకుంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగానే కవితను ఈ టీం ప్రజెంట్ చేస్తోంది. ఇక నుంచి మంత్రి కేటీఆర్కు ధీటుగా కవితకు సంబంధించిన అంశాలను సోషల్ మీడియాలో వైరల్ చేసేందుకు 25 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఈ బృందానికి హైదరాబాద్కు చెందిన ఓ యువ నాయకుడు నాయకత్వం వహిస్తున్నాడు.
అంతేకాకుండా త్వరలో ప్రతి వారం సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్సీ కవిత నెటిజన్ల ముందుకు రానున్నారు. రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై వారం వారం సోషల్ మీడియాలో మాట్లాడనున్నారు. నెటిజన్ల నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు. ఆస్క్ కేటీఆర్ తరహాలోనే.. “ సోషల్ మీడియా.. ఆన్సర్ ఫ్రమ్ కవిత’ అనే తీరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే దీన్ని విస్తృతంగా ప్రచారానికి తీసుకురానున్నారు.