మరోసారి సిర్పూర్ కాగజ్​ మిల్లు షట్‌డౌన్..!

by  |
మరోసారి సిర్పూర్ కాగజ్​ మిల్లు షట్‌డౌన్..!
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ :

దేశంలోనే పేరున్న సిర్పూర్ పేపర్ మిల్లు (SPM) మళ్లీ మూతపడనుంది. మూడు నెలలపాటు షట్​డౌన్​ చేసేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సుమారు దశాబ్దకాలం పాటు మూతపడిన ఈ పేపర్ మిల్లును తెరిపించేందుకు రెండేళ్ల కిందట తెలంగాణ ప్రభుత్వం, జేకే పేపర్‌ లిమిటెడ్‌ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తరువాత ఓపెన్​ అయిన మిల్లు కొన్నాళ్లపాటు లాభాల బాటలో నడిచింది. అయితే స్థానిక కూలీలు, ఉద్యోగులు ఎక్కువ వేతనాలతో పని చేస్తున్నారని భావించిన యా జమాన్యం పరోక్షంగా వారిని విధుల నుంచి తప్పించే ప్రయత్నం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.

సుమారు 260 మంది రెగ్యులర్, వెయ్యి మంది దాకా తాత్కాలిక కార్మికులను ఇప్పటికే యాజమాన్యం పక్కన బెట్టింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి తక్కువ వేతనాలతో కూలీలను తీసుకువచ్చి నడుపుతున్నారని విమర్శలు కూడా వెల్లువెత్తాయి. పక్షం రోజుల క్రితమే కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎంతోపాటు ఇతర వామపక్ష పార్టీల ఐక్య కూటమి యాజమాన్యం వైఖరిపై కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ని కలిసి ఫిర్యాదు చేశారు. స్థానిక కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అంతలోనే షట్‌డౌన్..

యాజమాన్యం పేపర్ మిల్లు షట్ డౌన్ చేయాలని నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతోంది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తెలంగాణ ప్రభుత్వం మిల్లును తెరిపించింది. ఆ తర్వాత యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుండడంతో తీవ్ర నిరసన వ్యక్తమవుతూ వస్తున్నది. తాజాగా సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30వరకు మిల్లు షట్ డౌన్ చేయాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామం కార్మికుల కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది.

కరోనా ఎఫెక్ట్… మిల్లులో భారీగా నిల్వలు..?

కరోనా ప్రభావం కారణంగానే మిల్లు 3నెలల పాటు షట్ డౌన్ విధిస్తున్నట్లు యాజమాన్యం చెబుతున్నది. ఈ మేరకు సంస్థ సీఈవో సూరి పేరిట నోటీసు విడుదల చేశారు. మార్కెటింగ్ లేని కారణంగా మిల్లు నడవలేని పరిస్థితి నెలకొందని యాజమాన్యం చెబుతోంది. ఇప్పటికే మిల్లులో కాగితపు నిల్వలు భారీగా పేరుకు పోయాయని చెబుతున్నారు. దీంతో కార్మికులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, నవంబర్ 30వరకు మిల్లు మూసి ఉంచుతామని ప్రకటించింది. తదుపరి నిర్ణయాన్ని ఆ తర్వాత ప్రకటిస్తామన్నారు.

కార్మికుల పొట్ట కొట్టే చర్య..

సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం, తెలంగాణ ప్రభుత్వం కుమ్మక్కైందని ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, ఐక్య రాజకీయ పక్షాల నేత గుళ్లపల్లి ఆనంద్ ఆరోపించారు. తాము ఇటీవల అన్ని రాజకీయ పక్షాలతో కలిసి ఆసిఫాబాద్ కలెక్టర్ ను కలిసి స్థానిక కార్మికులను విధు ల్లోకి తీసుకోవాలని కోరామన్నారు. మార్కెటింగ్ లే దని కుంటి సాకులు చెబుతూ యాజమాన్యం కా ర్మికుల పొట్ట కొడుతున్నదని వాపోయారు. కార్మికులను భయబ్రాంతులకు గురి చేసేందుకే ఈ చర్య తీ సుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే జోక్యం చేసుకుని మిల్లు షట్ డౌన్ కాకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed