కుంభకర్ణ నిద్రలో తెలంగాణ సర్కార్

by  |
jp nadda
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో తొమ్మిది జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి రిమోట్ పద్ధతిలో ఢిల్లీ నుంచి శంకుస్థాపన చేసిన సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడి విషయంలో తెలంగాణ సర్కారు కుంభకర్ణుడి తరహాలో నిద్రపోతోందని, హైకోర్టు మొట్టికాయలు వేసినా బుద్ధి రాలేదని అన్నారు. కరోనా టెస్టులు చేయటంలో తెలంగాణ వెనుకబడిపోయిందన్నారు. కొవిడ్ మేనేజ్‌మెంట్‌లో తెలంగాణ ప్రభుత్వాన్ని న్యాయస్థానాలు కూడా నిలదీసిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందని, రూ.45వేల కోట్లకు పూర్తికావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును దోచుకోవడం కోసమే రూ. 85వేల కోట్లకు పెంచిందని ఆరోపించారు. గడిచిన ఆరేళ్ళలో తెలంగాణ ప్రజలకు చేసిందేంటో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలిస్తానన్న కేసీఆర్ నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలని నిలదీశారు. ఏడు లక్షల ఇళ్ళు నిర్మిస్తానని 50 వేల ఇళ్ళు కూడా కట్టలేదని అన్నారు.

లోక్‌సభ ఎన్నికల తరహాలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని కోరారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలుచేయకపోవటం వల్ల సుమారు 98లక్షల మంది బీమా సౌకర్యాన్ని కోల్పోయారన్నారు. టీఆర్ఎస్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తుంటే కేసీఆర్ సర్కార్ బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేస్తోందని, అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని, తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ నూతన కార్యాలయాల ఏర్పాటే టీఆర్ఎస్‌ను గద్దెదింపడానికి తొలి మెట్టు అవుతాయన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ జి.ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షులు డా. కె.లక్ష్మణ్ పాల్గొన్నారు. భూమిపూజ జరుగుతోన్న జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ రూరల్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కుమ్రం భీం అసిఫాబాద్, వనపర్తి, నారాయణపేట్, వికారాబాద్జిల్లాల నుంచి ఆయా జిల్లాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed