ఏపీలో జనతా బజార్లు.. రేపటి నుంచి కూపన్ల జారీ: కన్నబాబు

by  |
ఏపీలో జనతా బజార్లు.. రేపటి నుంచి కూపన్ల జారీ: కన్నబాబు
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనతా బజార్లను పరిచయం చేస్తోంది. ఈ జనతా బజార్లలో పంట పండించిన రైతులు తమ ఉత్పత్తులను నిరభ్యంతరంగా అమ్ముకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. రేపటి నుంచే రైతులకు తమ పంటలు విక్రయించుకునేందుకు వీలుగా కూపన్లు అందజేస్తామని ఆయన తెలిపారు.

అన్నపూర్ణగా పిలిచే ఆంధ్రప్రదేశ్ ప్రధాన జీవన, ఆదాయ వనరు వ్యవసాయమే. వ్యవసాయోత్పత్తి ఇక్కడ భారీ ఎత్తున జరుగుతుంటుంది. వరిని ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు పండిస్తారు. రబీ సీజన్‌లో వరి పండించని రైతులు అపరాలు, తృణధాన్యాలు పండిస్తారు. మరికొందరు సిరి ధాన్యాలు పండిస్తారు. పండించిన పంటను ఇంటి అవసరాలకు ఉంచుకోగా మిగిలినది విక్రయిస్తాయిరు. ఈ రకంగా ఏటా లక్షల టన్నుల ఆహారధాన్యాల క్రయవిక్రయాలు జరుగుతాయి. దీనికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసినా, ప్రైవేటు వర్తకులకు టోకున విక్రయిస్తుంటారు. కరోనా వైరస్ ఉధృతంగా ఉన్న సమయంలోనే రబీ సీజన్ ముగిసింది.

లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో రైతులు పండిన పంటలను సరైన సమయంలో సేకరించుకోలేకపోవడంతో పాటు విక్రయించుకోలేకపోయారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే స్పందిచి జనతా బజార్లు ఏర్పాటు చేస్తామని తెలిపింది. వ్యవసాయ ఉత్పత్తులకు స్థానిక మార్కెట్ ఉండేందుకే జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. పంటకు ప్రభుత్వ మద్దతు ధర కన్నా ఎక్కువ ధర వస్తే రైతులు అమ్ముకోవచ్చని ప్రకటించారు. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలోని వివిధ ప్రాతాల్లో గత వారం రోజులుగా చిరుజల్లులతో పాటు ఓ మాదిరి వర్షాలు కురుస్తుండడంతో పంటలు తడిసి పోయాయి. దీంతో తడిసిన పంటలను కూడా కొనుగోలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. దీంతో పంటల కోనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల్లో వరి, రాయలసీమ నుంచి అరటి, బత్తాయిని మార్కెట్లకు తరలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండిన టమాట, మిర్చి, అరటి, పసుపు పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. 1,300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ధాన్యానికి రూ.1,760 చొప్పున మద్దతు ధర ఇస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మే 15న ప్రతి రైతు ఖాతాలో రైతు భరోసా పెట్టుబడి సాయం కింద డబ్బులు జమ అవుతాయని ఆయన చెప్పారు. గ్రామజీవనానికి పట్టుగొమ్మగా నిలిచే రైతును తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన తెలిపారు.

Tags: kurasala kannababu, kannababu, agriculture department, janata bazar, products



Next Story