17 వేల లేఅవుట్లలో 20కోట్ల మెక్కలు నాటాలి : జగన్

by  |
17 వేల లేఅవుట్లలో 20కోట్ల మెక్కలు నాటాలి : జగన్
X

దిశ, ఏపీబ్యూరో :
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని గాజులపాడులో వైఎస్సార్సీపీ ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం 9గంటలకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ‘జగమంతా వనం.. ఆరోగ్యంతో మనం’అనే నినాదంతో పరిసరాల్లో పచ్చదనాన్ని నింపాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు ఇబ్రహీం పట్నం నుంచి వనమహోత్సవం ఆరంభిస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు.

‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమానికి రాష్ట్రంలోని 13 వేల పంచాయతీల్లో పేద ప్రజలకోసం 17 వేల లే అవుట్లు సిద్ధం చేశామని చెప్పారు. వీటిల్లో 20 కోట్ల మొక్కల్ని నాటాలని నిర్ణయించామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పది మొక్కల చొప్పున నాటాలని జగన్ పిలుపునిచ్చారు. ప్రతిఊరూ, ప్రతి ఇల్లూ పచ్చదనంతో సింగారిద్దామని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హంగూ ఆర్భాటాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదని సూచిస్తూ, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ మేరకు ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు.

వచ్చేనెల 15న 30లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ఆయన సూచించారు. అయితే, తాము పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ, సంక్షేమ కార్యక్రమాలు ఆపేందుకు కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. విపక్షాల కుట్రలను ప్రజలు గమనించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన రావి, వేప మొక్కలను నాటారు.


Next Story