అన్నార్తుల కోసం ఇంటి ముందు బుట్టల్లో ఆహారం.. ఆదర్శంగా నిలుస్తున్న ఇటాలియన్ల ఆలోచన

by  |
అన్నార్తుల కోసం ఇంటి ముందు బుట్టల్లో ఆహారం.. ఆదర్శంగా నిలుస్తున్న ఇటాలియన్ల ఆలోచన
X

దిశ వెబ్ డెస్క్: కరోనా.. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. జనజీవనాన్ని స్తంభింప చేసింది. దినసరి కూలీలు, వీధి చిన్నారులు, అనాథలు, నిరుపేదలు ఇలా ఎందరికో కష్టాలను మిగిల్చింది. అన్నం లేకుండా చేసింది. మూగ జీవాలకు ఆహారం లేకుండా చేసింది. ఇప్పటికే ఎంతోమంది సహృదయులు అన్నార్తుల ఆకలి తీర్చేందుకు ముందుకు వస్తున్నారు. ఆహారం అందిస్తూ.. తమ ఆకలిని తీరుస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న ఎందరికో కడుపునిండా అన్నం పెట్టేందుకు ఫ్రాన్స్ ప్రజలు ఓ అందమైన పద్దతిని అనుసరిస్తున్నారు. ఆహారాన్ని బుట్టల్లో పెట్టి .. ఇంటి ముందు వేలాదిస్తున్నారు. ఆకలితో ఉన్న ఎవరైనా సరే… ఈ బుట్టల్లోని ఆహారాన్ని తీసుకోవచ్చు. ఆపత్కాలంలో సాటి మనిషిని ఆదుకునేందుకే ఇటాలియన్లు అనుసరిస్తున్న ఈ పద్దతి అందరికీ ఆదర్శమని నెటిజన్లు భావిస్తున్నారు.

కరోనా వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అది కాదనలేని వాస్తవం అయితే.. కరోనా వల్ల ఎక్కువ కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటోంది మాత్రం నిరుపేదలే. మన దేశంలో పేదలే సంఖ్యే ఎక్కువ. కోట్లాదిమందికి రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి.. రోజూ కూలీకి, లేదా ఏదైనా పనికి వెళితే గానీ.. వాళ్లకు నాలుగు మెతుకులు దొరకవు. ఓ వైపు దేశమంతా లాక్ డౌన్ కావడంతో పనులు కోల్పోయారు. మరో వైపు చేతిలో డబ్బుల్లేక.. చేసేందుకు పనుల్లేక పస్తులతో కాలం వెళ్లేదీస్తున్నారు. మరి వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అందరికీ అందడం లేదు. దాంతో స్వచ్ఛంద సంస్థలు, సహృదయులు ఆకలితో అలమటిస్తున్న ఎందరికో ఆహారం అందిస్తున్నారు. మరి కొందరికీ నిత్యవసర వస్తువులు ఇస్తున్నారు. అయినా ఆ సేవలు సరిపోవడం లేదు. దాంతో ఇటాలియన్లు ఓ సరికొత్త పద్దతికి శ్రీకారం చుట్టారు. ఆహారాన్ని బుట్టల్లో పెట్టి .. ఇంటి ముందు వేలాదిస్తున్నారు. అన్నార్తులు ఈ బుట్టల్లోని ఆహారం తీసుకుని తమ కడుపు నింపుకుంటున్నారు. మొదట నేపుల్స్‌లో ప్రారంభమైన ఈ విధానం అతి కొద్ది రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించింది. నేపుల్స్‌ నగరానికి కున్న ప్రాచీన సాంప్రదాయమే ఈ కొత్త విధానానికి మూలం అని స్థానికుడొకరు తెలిపారు. సపోర్ట్ బాస్కెట్స్‌గా పాపులరవుతున్న ఈ విధానానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

100 శాతం అందుతుందా?

నిరుపేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం తన వంతు సాయం చేస్తోంది. రేషన్ కార్డు దారులు మాత్రమే ప్రభుత్వం సాయం పొందుతున్నారు. మరి వీధుల్లో నివసిస్తున్న వాల్లు, భిక్షగాళ్లు, అనాథలు, రేషన్ కార్డు లేని వాళ్ల గురించి ఎవరూ ఆలోచించాలి. అంతేకాదు ప్రభుత్వం అందించే సాయం నూరు శాతం పేదలకు అందుతుందనే గ్యారంటీ లేదు. అందుకే.. ఇటలీ ప్రజలు ప్రభుత్వం గురించి ఆలోచించకుండా తమకి తామే తోటి మనుషులను కాపాడుకొనేందుకు ముందుకొస్తున్నారు. తాము తయారు చేసుకున్న, నిల్వ ఉంచుకున్న ఆహారంలో కొంత వారికి ఇస్తున్నారు. ఈ సందర్భంగా తమ ఇళ్ల ముందు బుట్టలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో ఆహార పదార్థాలను ఉంచుతున్నారు. ఆహారం అవసరమైన వారు ఈ బుట్టలో ఉన్న ఫుడ్ తీసుకోవాలని చీటీ పెడుతున్నారు.

మొదట అక్కడే:

ఇటలీలోని నేపుల్స్ నగరంలో ‘సపోర్ట్ బాస్కెట్స్’ పేరుతో ఇది మొదలైంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇటలీలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల ముందు బుట్టలు వేలాడదీస్తున్నారు. ఇటలీలో పేదల కోసం ఇలాంటి బుట్టలు ఏర్పాటు చేసే సాంప్రదాయం పూర్వం నుంచే ఇటలీలో ఉందని నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు.

మన దగ్గర:

చారిటి బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు. అంటే.. సహాయం మన ఇంటి నుంచే మొదలవ్వాలని అర్థం.. దానికి సపోర్ట్ బాస్కెట్స్ అనే ఆలోచన అక్షరాల నిజం చేసింది. ప్రస్తుతం దేశమంతా కూడా విపత్కర పరిస్థితుల్లో ఉంది. ఈ సమయంలో. చాలా మంది సెలబ్రెటీలు, సామాన్యులు, బిజినెస్ పర్సన్స్ తమ సహృదయాన్ని చాటుకుంటూ విరాళాలు అందిస్తున్నారు. చిన్నారులు కూడా తమ కిడ్డీ బాక్సుల్లోని డబ్బులను విరాళంగా ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఇంకా ఎంతో మంది తమ వద్ద డబ్బులు దానం చేసే స్తోమత లేదని భాదపడుతుంటారు.. అలాంటి వారు ఇలా తమ ఇంట్లో వంట చేసి.. ఆకలితో ఉన్న వాల్లకు ఆహారం అందించవచ్చు. ఇలాంటి ఆపత్కాలంలో ఒక్కరి కడుపు నింపినా, ఒక్కరికి సాయం చేసినా.. మన బాధ్యతను మనం నిర్వర్తించినట్లే. సపోర్ట్ బాస్కెట్స్ ఆలోచన మన దగ్గర కూడా మొదలైతే.. ఎంతోమంది అన్నార్తుల కడుపు నిండుతుంది. అసలే అన్నపూర్ణ దేశం మనది.

Tags: coronavirus, italy, support baskets, food, orphans, charity


Next Story

Most Viewed