ఉమ్మడి ఖమ్మంలో దంచికొడుతున్న వర్షం..

by  |
ఉమ్మడి ఖమ్మంలో దంచికొడుతున్న వర్షం..
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో వాన దంచికొడుతోంది. రెండ్రోజులుగా ఇరు జిల్లాల్లో వ‌ర్షం జోరుగా కురుస్తోంది. దీంతో చెరువులు, కుంట‌లు మ‌త్త‌ళ్లు పోస్తుండ‌గా, వాగులు, వంక‌లు ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్నాయి. ఖమ్మం జిల్లాలో చింతకాని, కొణిజర్ల, కామేపల్లి, తిరుమలాయపాలెం, కూసుమంచి, ఏన్కూరు, ఎర్రుపాలెం తదితర మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. భద్రాద్రి జిల్లాలోనూ ముఖ్యంగా చర్ల, జూలూరుపాడు, చండ్రుగొండ, గుండాల, మణుగూరు, ఇల్లందు, కొత్త‌గూడెం, పాల్వంచ‌, దుమ్ముగూడెం, అశ్వాపురం, తదితర మండలాల్లో భారీ వ‌ర్షం న‌మోదైంది.

బుధవారం ఉద‌యం నుంచి ఖమ్మంలో జ‌ల్లులు కురుస్తూనే ఉన్నాయి. నగరంలోని పలు ప్రధాన కూడళ్లను వరద నీటితో ముంచెత్తింది. ప‌లుచోట్ల‌ వరద నీరు రోడ్లపై ప్రవహించింది. మున్నేరు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. భద్రాచలం దగ్గర క్రమంగా గోదావరి వరద నీటిమట్టం క్ర‌మంగా పెరుగుతోంది. ప్రస్తుతం 30 అడుగులకు నీటిమ‌ట్టం చేరుకుంది. ఎగువ పడ్డ వర్షాలకు వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నాయి. పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. కిన్నెరసాని పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 405 అడుగులకు చేరుకుంది.

కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు చాలా మండ‌లాల్లో జన జీవనం పూర్తిగా స్తంభించింది. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద నీరు.. 7 గేట్లు ఎత్తి 17626 క్యూసెక్కుల నీరు దిగువకు విడుద‌ల చేశారు. పాలేరు రిజర్వాయ‌ర్‌కు భారీగా వ‌ర‌దనీరు చేరడంతో, బుధ‌వారం మంత్రి అజ‌య్‌కుమార్ గేట్లు ఎత్తి నీటిని విడుద‌ల చేశారు. కాల్వ‌ల ద్వారా నీరు దిగువ ప్రాంతాల‌కు వెళ్తోంది. వ‌ర‌ద నీరు భారీగా చేర‌డంతో ఇల్లందు, కొత్త‌గూడెం,స‌త్తుప‌ల్లిల‌లో ఓపెన్ కాస్టుల్లో బొగ్గు వెలికితీత ప‌నులు నిలిచిపోయాయి. ఈ సమయంలో ప్రజలు వాగులు దాటే ప్రయత్నాలు చేయొద్దని భద్రాద్రి కలెక్టర్ ఎంవీ రెడ్డి ప్రజలను హెచ్చ‌రించారు. ఎవ‌రికైనా వ‌ర‌ద‌ల‌తో ఇబ్బందులు ఎదురైతే 08744241950 కు కాల్ చేసి వివరాలు తెలియజేయాలని అధికారులు తెలిపారు.


Next Story