భారత్‌కి అండగా ఇజ్రాయిల్.. అత్యవసర సాయానికి అంగీకారం

by  |
భారత్‌కి అండగా ఇజ్రాయిల్.. అత్యవసర సాయానికి అంగీకారం
X

దిశ, వెబ్ డెస్క్: గాల్వాన్ లోయలో చైనా సైనికులు, భారత సైనికుల మోహరింపుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత్ అత్యాధునిక ఆయధాలను సమకూర్చుకుంటోంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి గత కొన్నేళ్లుగా భారత్ అనుసరిస్తున్న విధానాలు, వ్యూహాలూ సత్ఫలితాలను ఇస్తున్నాయి. మునుపెన్నడూ లేని స్థాయిలో ఇజ్రాయిల్‌తో భారత్ మైత్రీ సంబంధాలు బలోపేతమయ్యాయి. చైనా, పాకిస్థాన్ వంటి పొరుగు దేశాలు పక్కలో బల్లెంలా తయారైన వేళ… ఇజ్రాయిల్ భారత్‌కు అండగా నిలుస్తోంది. తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులను చైనా పొట్టనబెట్టుకోవడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. చైనాకు దీటుగా ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత్ సర్వం సన్నద్ధమైంది. రెండు దేశాల సైన్యాల మోహరింపుతో దేశ వాస్తవాధీన రేఖ వెంబడి టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఆయుధాలను సమకూర్చుకోవడంలో భారత రక్షణశాఖ నిమగ్నమైంది. డ్రాగన్ దేశం కయ్యానికి కాలుదువ్వుతుండటంతో అనుమతులు లేకుండానే రూ.500 కోట్ల లోపు ఆయుధాలను కొనుగోలు చేసుకునేందుకు భారత రక్షణ దళాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది.

ఇందులో భాగంగా ఇజ్రాయిల్ నుంచి అత్యవసరంగా SPICE-2000 బాంబులను భారత వైమానిక దళం (IAF) కొనుగోలు చేస్తోంది. భారత వైమానిక దళం నుంచి అందిన అభ్యర్థన మేరకు దీన్ని అత్యవసరంగా సమకూర్చేందుకు ఇజ్రాయిల్ అంగీకరించినట్టు తెలుస్తోంది. చివరగా 2019లో పాకిస్థాన్‌లోని బాలకోట్‌‌లోని తీవ్రవాద స్థావరాలపై నిర్వహించిన మెరుపుదాడుల్లో భారత వైమానిక దళం ఈ బాంబులను వినియోగించింది. ఫ్రాన్స్‌లో తయారైన మిరాజ్-2000 జెట్స్ ద్వారా ఈ బాంబులను వినియోగించారు. నియంత్రణ రేఖకు 60 కిలోమీటర్ల దూరంలోని బాలకోట్‌లో ఉన్న తీవ్రవాదుల శిబిరాలను ఈ బాంబులు క్షణాల్లో నేలమట్టం చేశాయి.

గగనతలం నుంచి భూతలంలోని లక్ష్యాలను టార్గెట్ చేసేందుకు ఈ SPICE-2000 బాంబులు ఉపయోగపడుతాయి. శత్రు దేశాల బంకర్లు, భవంతులను క్షణాల్లో పూర్తిగా నేలమట్టం చేయగల సామర్థ్యం వీటి సొంతం. గత ఏడాది కొనుగోలు చేసిన వాటికి అదనంగా ఇప్పుడు వీటిని భారత్ కొనుగోలు చేస్తోంది. స్మార్ట్, ప్రిసైజ్ ఇంపాక్ట్, కాస్ట్ ఎఫెక్టివ్‌కి సంక్షిప్త నిర్వచనంగా SPICE అని పిలుస్తున్నారు. అటు ఫ్రాన్స్ కూడా రాఫెల్ యుద్ధ విమానాలను ఈ నెలాఖరుకల్లా భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాఫెల్ యుద్ధ విమానాలు కూడా వస్తే భారత రక్షణ దళం మునుపెన్నడూ లేనంత పటిష్టంగా మారనుంది.


Next Story