ఒకే జిల్లాలో 3 దశాబ్దాల ఉద్యోగం.. ఎక్కడా?

by  |
ఒకే జిల్లాలో 3 దశాబ్దాల ఉద్యోగం.. ఎక్కడా?
X

దిశ, న్యూస్ బ్యూరో: కొందరు అధికారులు నియామకం పొందిన చోటే ఏళ్ల తరబడి పాతుకుపోతున్నారు. జూనియర్ అసిస్టెంట్గా చేరి డిప్యూటీ కలెక్టర్ వరకు అక్కడే తిష్ఠ వేస్తున్నారు. రెవెన్యూ శాఖలో మూడు దశాబ్దాల ఉద్యోగ కాలమంతా ఒకే జిల్లాలో కొనసాగిస్తున్న అధికారులూ ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. మాట వినని ఐఏఎస్ వచ్చినప్పుడు అదే జిల్లాలో అప్రాధాన్య పోస్టులలో కూర్చుంటారు. సదరు అధికారి వెళ్లిపోగానే పైరవీలకు రెక్కలొస్తాయి.

తాజాగా ఏసీబీకి చిక్కిన కీసర తహశీల్దార్ ఎర్వ నాగరాజుతోపాటు అవినీతి మరకలు అంటినవారి వ్యవహారశైలి ఆది నుంచి వివాదా స్పదమే. నచ్చిన చోట పోస్టింగు కొట్టేయడం వారికి వెన్నతో పెట్టిన విద్యగా రెవెన్యూ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇద్దరు తహశీల్దార్లు ఏసీబీ కేసుల నుంచి బయట పడకపోయినా కీలక పోస్టింగులు సంపాదించుకున్నారు. వారి వెనుక పెద్ద వ్యవస్థలే ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. సదరు అధికారులు కూడా మీడియాలోని కొందరిని మచ్చిక చేసుకొని తమ వెనుకనున్న అదృశ్య శక్తులెవరన్న అంశాన్ని అందరికీ తెలిసేటట్లు చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో ఈ అసాధారణ పరిస్థితులకు ఖచ్చితంగా బాధ్యత ఉన్నతస్థాయిలోని అధికార వర్గానిదే. పోస్టింగులు ఇవ్వాలంటూ సిఫారసు చేస్తున్న మంత్రులదే. అవినీతి ఉచ్చులో చిక్కినా కీలక పోస్టింగులు ఇచ్చే ఐఏస్ అధికారులదే.

అవే వారి పెట్టుబడులు

హైదరాబాద్ శివారులోని ఓ ఆర్డీఓ మూడు దశాబ్దాలుగా ఇక్కడిక్కడే పని చేశారు. ఆయన తన నిజాయితీ ముందు ఎవరూ పనికి రారన్నట్లుగా చెప్పుకుంటారు. ప్రభుత్వ భూములు, రియల్ ఎస్టేట్ భూం అధికంగా ఉన్న ప్రాంతాలలోనే పోస్టింగులు సంపాదించుకుంటారు. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలను వీడి దూరంగా వెళ్లేందుకు మాత్రం నిరాకరిస్తారన్న ఆరోప ణలు ఉన్నాయి. మూడేండ్లు కాగానే వేరే జిల్లాకు బదిలీ చేయాలని, అప్పుడే ఈ అవినీతి, అక్రమాలకు కాస్తయినా బ్రేకులు పడుతాయని ఓ డిప్యూటీ కలెక్టర్ అభిప్రాయపడ్డారు.

నాగరాజు వంటి తహశీల్దార్లకు కీలక స్థానాల్లో పోస్టింగులు ఇచ్చేవారిదే బాధ్యత అని రెవెన్యూ యంత్రాంగం అభిప్రాయపడుతోంది. ఆరోపణలు వచ్చినవారిని రియల్ ఎస్టేట్, ప్రభుత్వ భూములు అధికంగా ఉండే ప్రాంతాల్లో కూర్చోబెట్టడమంటే అవినీతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేగా అన్న సందేహం కలుగుతోంది. కీలక పోస్టింగుల కోసం సీపీఎల్ఏ కార్యాలయం నుంచే పైరవీలు మొదలు పెడుతున్నారని తెలిసింది. అక్కడి నుంచి మొదలు ఐఏఎస్ ల వరకు బుట్టలో వేసుకుంటున్నారు. కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా సిఫారసు చేసేటప్పుడు కొందరికి పెద్ద పీట వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బదిలీలను అడ్డుకున్నందుకు పెద్ద అధికారులకు విలువైన బహుమానాలే ఇస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర స్థాయి పోస్టుల బదిలీల్లో నిజాయితీ, నిబంధనలు పాటిస్తే అక్రమార్కులకు బ్రేకులు పడుతాయన్నారు.


Next Story

Most Viewed