హరీశ్‌రావు 'చెత్త' ప్రయోగం.. సక్సెస్ అవుతదా ?

by  |
హరీశ్‌రావు చెత్త ప్రయోగం.. సక్సెస్ అవుతదా ?
X

దిశ, సిద్ధిపేట: సిద్ధిపేట ప్రయోగాలకు, సంస్కరణలకు వేదిక.. ఈ అంశాన్ని మరోసారి ఎలుగెత్తి చాటడానికి పట్టణం సన్నద్ధమవుతోంది. చెత్త సేకరణ నిర్వహణలో ప్రయోగాత్మక పరిశీలనకు సమాయత్తమవుతోంది. ఏ వార్డులోని తడి చెత్తను అదే వార్డులో సేంద్రియ ఎరువుగా మార్చే బృహత్తర కార్యాచరణ రూపొందుతున్నది. ఇందుకు ఆరు వార్డులను ఎంపిక చేశారు. వాటిల్లో చైతన్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర మంత్రి హరీష్ రావు స్వయంగా రంగంలోకి దిగి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. భవిష్యత్తులో పట్టణంలోని అన్ని వార్డుల్లో ఇదే విధానం అనుసరించాలని నిర్ణయించారు. ప్రపంచ వ్యాప్తంగా చెత్త నిర్వహణ సవాల్‌గా మారిన నేపథ్యంలో ఎంచుకోవడం విశేషం.

జిల్లా కేంద్రంగా మారిన సిద్దిపేట వేగంగా విస్తరిస్తోంది. కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే మెరుగ్గా ఉన్నా.. సమర్థ నిర్వహణ పూర్తిస్థాయిలో ఇంకా పట్టాలెక్కలేదు. పట్టణ విస్తీర్ణం 50.03 కిలోమీటర్లు.. సిద్దిపేటలో 39,616 కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 1.46 లక్షల మంది జీవిస్తున్నారు. నిత్యం సగటున 180 క్వింటాళ్ల తడి, 12 క్వింటాళ్ల పొడి, 30 క్వింటాళ్ల డొమెస్టిక్ హానికర చెత్త ఉత్పత్తి అవుతున్నది. సేకరణ నిర్వహణ మాత్రం పక్కాగా జరగడం లేదు. 95 శాతం కుటుంబాల నుంచి చెత్తను సేకరిస్తున్నా తడి, పొడి విడి విడిగా సేకరిస్తోంది మాత్రం 45 శాతం కుటుంబాల నుంచే. ఇక హానికర డొమెస్టిక్ చెత్తను వేరుగా మొత్తానికి ఇవ్వడంలేదు. ఫలితంగా ఆశించిన ఫలితం రావడం లేదు. పట్టణంలోని ఖాళీ స్థలాలు డంపింగ్ యార్డ్ లుగా మారాయి. ఈ అంశాన్ని గుర్తించిన రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు మార్పు దిశగా అడుగులు వేయడానికి సంకల్పించారు. బెంగళూరుకు చెందిన పర్యావరణ వేత్త, ఓ సంస్థ ప్రతినిధి డాక్టర్ శాంతితో ఈ అంశంపై చర్చించారు. అక్కడ చేపట్టిన ప్రయోగం ఫలితాలను ఆరా తీశారు. ఆ విధానాన్ని సిద్దిపేటలో అమలు చేయాలని నిర్ణయించారు.

పట్టణంలోని 1, 4, 10, 12, 22, 33 వార్డులను ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు. ఈ వార్డు కౌన్సిలర్ లు బెంగళూరులో జరిగిన కార్యశాలకు హాజరయ్యారు. డాక్టర్ శాంతి ఆధ్వర్యంలో 10 రోజులపాటు వార్డుల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇకపై వారంలో ఐదు రోజులు తడి, రెండు రోజుల పాటు పొడి చెత్త, ఆరు రోజులపాటు హానికర డొమెస్టిక్ చెత్త ఇతర వాహనాల్లో తీసుకోనున్నారు. ఇప్పటికే ఈ వార్డులో రెండేసి బుట్టలు పంపిణీ చేయగా, పొడి చెత్త కోసం జుట్టు బ్యాగులు కూడా ఇవ్వనున్నారు. ఈ ఆరు వార్డుల్లో 240 చదరపు అడుగుల విస్తీర్ణంలో 5.50 లక్షల అంచనా వ్యయంతో ప్రభుత్వ స్థలాల్లో ఎయిరోబిక్ కంపోస్టింగ్ ట్విన్ బ్యాంకుల ఏర్పాటులో భాగంగా ఒక్కో దాంట్లో పది నిర్మించనున్నారు. ఇప్పటికే స్థలాలు ఎంపిక చేశారు.

ఒక్కో కేంద్రంలో నిత్యం సగటున ఆరు కుంటాల తడి చెత్తను ఇందులో వేస్తున్నారు. నెలకు సగటున 180 క్వింటాళ్లు వస్తుందని భావిస్తుండగా అందులో 30 శాతం మేరకు సేంద్రియ ఎరువు తయారు కానుంది. నెలకు ఒక్కో కేంద్రంలో సగటున 50 క్వింటాళ్ల చొప్పున ఆరు కేంద్రాల్లో 300 క్వింటాళ్ల ఎరువు తయారు కానుంది. ఇక సేకరించిన పొడి చెత్తను పట్టణంలోని మధ్యంతర రవాణా కేంద్రంలోకి తరలించి ప్రత్యేక యంత్రం ద్వారా దాన్ని కంప్రెస్ చేయనున్నారు. అందులో సీసాలు పాల ప్యాకెట్లు, అత్తపెట్టెలు, పత్రికలు వంటి వాటిని వేరుగా కంప్లీట్ చేసి ఈఐటీసీ ద్వారా రీసైక్లింగ్ కు పంపిస్తారు. సానిటరీ ప్యాడ్స్ వంటి వాటిని డొమెస్టిక్ హానికర చెత్తను వేరు పరచి బయోమెడికల్ వ్యర్థాలను తీసుకెళ్లే వాహనాలకు అందజేస్తారు. రాష్ట్ర మంత్రి హరీష్ రావు.డాక్టర్ శాంతి ఇప్పటికే అవగాహన ప్రారంభించగా ఆమె వారం రోజుల పాటు ఇక్కడ ఉండనున్నారు. ఇల్లు, బడులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ఆస్పత్రులు ప్రార్థనా స్థలాలు ఇలా ప్రతి చోట ప్రతి ఒక్కరికి దీనిపై అవగాహన కల్పించడం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.


Next Story

Most Viewed