మరో మాంఝీ.. ఈ గొర్రెల కాపరి

by Shyam |
మరో మాంఝీ.. ఈ గొర్రెల కాపరి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏళ్లపాటు గుట్టను తవ్వి రోడ్డు నిర్మించిన దశరథ్ మాంఝీ అందరికీ గుర్తుండే ఉంటాడు. ఆయన తరహాలోనే కర్నాటకకు చెందిన కల్మనే కామెగౌడ అనే 72 ఏళ్ల వృద్ధుడు.. గొలుసుకట్టు రీతిలో 16 నీటి కుంటలను తవ్వించాడు. ఓ సాధారణ గొర్రెల కాపరి అయిన కామెగౌడ.. తను నిస్వార్థంగా చేసిన పనులతో జాతీయ స్థాయిలో ‘పాండ్ మ్యాన్’గా గుర్తింపు దక్కించుకున్నాడు.

బెంగళూరు నగరానికి 120 కి.మీల దూరంలో గల దాసనదొడ్డి అనే పర్వతప్రాంత గ్రామమే కామెగౌడ స్వస్థలం. తన ప్రాంతంలో రోజురోజుకూ నీటి వనరులు తగ్గిపోవడాన్ని దగ్గర నుంచి గమనించిన ఆయన.. భవిష్యత్తులో నీటి సంక్షోభం తప్పదని ముందే ఊహించాడు. అది రాకుండా ఉండాలంటే చెరువులు నిర్మించాలని గ్రామస్తులకు ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. కానీ వారు తన మాటలు నమ్మేవారు కాదు. ‘పిచ్చివాడు’ అని పిలుస్తూ హేళన చేసేవారు. అయినా, ఇవేవీ పట్టించుకోని కామెగౌడ.. వంశపారంపర్యంగా తనకు వచ్చిన గొర్రెలను కాస్తూనే మిగిలిన సమయంలో చెరువులు తవ్వడం ప్రారంభించాడు. పార, పలుగును నిత్యం తన వెంటే ఉంచుకొని, భూమి తేమను బట్టి ఎక్కడ చెరువు తవ్వితే నీళ్లు నిలుస్తాయో గుర్తించి తవ్వడం స్టార్ట్ చేశాడు. అలా చెరువుల కోసం దాదాపు రూ.10 లక్షలను వెచ్చించారు. ఈ క్రమంలో ఒక్కోసారి డబ్బు అవసరమైతే తన గొర్రెలను కూడా అమ్మేవాడు. అలా ఇప్పటివరకు 16 నీటి కుంటలను తవ్వించాడు.

కామెగౌడ సేవలను గుర్తించిన కర్నాటక రాష్ట్రప్రభుత్వం.. రెండేళ్ల కిందే ఆయన్ను సత్కరించింది. ప్రధాని మోడీ సైతం ఈయన పేరును ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించారు. సాధారణ రైతే గానీ అసాధారణమైన ప్రభావశీలి అని ప్రశంసించారు. కాగా, భవిష్యత్ తరాలకు సహజ వనరులు అందాలనే సదుద్దేశంతో చెరువులు తవ్వించిన కల్మనేకు జాతీయ అవార్డు ఇవ్వాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.



Next Story