రష్యా టీకా సురక్షితమేనా?

by  |
రష్యా టీకా సురక్షితమేనా?
X

న్యూఢిల్లీ: కరోనాకు తొలి టీకా అంటూ రష్యా చేసిన ప్రకటనపై ఒకవైపు హర్షం వ్యక్తమవుతుండగా, మరోవైపు అనుమానాలు వెలువడుతున్నాయి. అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించామని, స్వయంగా తన కూతురికే ఈ టీకా ఇచ్చారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించినప్పటికీ వ్యాక్సిన సేఫ్టీపై సమగ్ర వివరాలు బహిరంగ పరచాలని, ప్రసిద్ధ మెడికల్ జర్నల్‌లలో ప్రచురించాలని, మూడో దశ ట్రయల్స్ లేకుండా వ్యాక్సిన్‌ను విడుదల చేయాలనుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా అభ్యంతరాలు వినిపిస్తున్నాయి. తమ వ్యాక్సిన్‌పై భారత్ కూడా ఆసక్తి చూపుతున్నదని రష్యా ప్రకటించినప్పటికీ, భారత్‌లోనూ నిపుణులు స్పుత్నిక్-విపై అనుమానాలు లేవనెత్తుతున్నారు. అంతేకాదు, వ్యాక్సిన్ కొనుగోలుపై అప్రమత్తతను వ్యక్తంచేస్తూ రాష్ట్రాలు టీకా కోసం ప్రత్యేకంగా డీల్ చేసుకోవద్దని కేంద్రం సూచించింది.

రెండు నెలల్లోనే ట్రయల్స్ పూర్తయ్యాయా?

జూన్‌లో ట్రయల్స్ ప్రారంభించినట్టు ప్రకటించిన రష్యా టీకాను అక్టోబర్‌లో పెద్దమొత్తంలో ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ముందుగా రిస్కు ఎక్కువున్నవారికి, టీచర్లకు, వైద్యులకు టీకా అందిస్తామనీ తెలిపింది. మూడో దశ ట్రయల్స్ ఆగస్టు 12 నుంచి ప్రారంభిస్తామని పేర్కొంది. అయితే, ఈ ప్రకటనలన్నింటినీ జాగరూకతగా గ్రహించాలని భారత ఇమ్యూనాలజిస్ట్ వినీత బాల్ తెలిపారు.

జూన్ నుంచి ఆగస్టులోనే వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తవడం నమ్మశక్యం కావడం లేదని, ట్రయల్స్ దశలు, వాలంటీర్ల సంఖ్య, సమగ్ర వివరాలు బహిరంగం చేయనిది టీకాను విశ్వసించడం కష్టమని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-పూణెకు చెందిన ఇమ్యునాలజిస్ట్ బాల్ అన్నారు. ప్రాథమిక సమాచారాన్ని ప్రకటించారని, ఆ వివరాలనూ ప్రజల ముందుకు తీసుకురాలేదని, టీకా సమర్థతపై సమగ్ర సమాచారమే లేదని ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ పరిశోధకుడు సత్యజిత్ రత్ తెలిపారు. అంటే, టీకా సమర్థపై సరైన సమాచారం లేకుండానే ప్రజలకు ఇవ్వడానికి సిద్ధమయ్యారని, ఇది పేషెంట్లలో మరో కొత్త సమస్యకూ దారి తీయవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు.

ఫేజ్ 3లో వైఫల్యాలున్నాయి..

టీకాను అభివృద్ధి ల్యాబ్‌లో ప్రయోగాల నుంచి మొదలుకుని జంతువు నమూనాలు, అనంతరం మనుషులపై ట్రయల్స్ వరకు సాగుతుంది. మనుషులపై మూడు దశల్లో ప్రయోగాలుంటాయి. తొలి దశలో పదుల సంఖ్యలో వాలంటీర్లకు టీకా ఇచ్చి అది సురక్సితమేనా? కాదా? అని పరీక్షిస్తారు. సురక్షితమని ఫలితాలు రుజువు చేస్తే రెండో దశలో వందల సంఖ్యలో పార్టిసిపెంట్లకు టీకా ఇచ్చి వైరస్‌ను టీకా ఏ స్థాయిలో ఎదుర్కొంటున్నదో పరిశీలిస్తారు. ఇందులోనూ సత్ఫలితాలు కనిపిస్తే మూడో దశలో భాగంగా పెద్దమొత్తంలో అంటే వేలాది మందిపై టీకాను ప్రయోగించి ఫలితాలు పరీక్షిస్తారు.

రెండో దశలో వందల మందిపైనే టీకా ప్రయోగిస్తారు కాబట్టి ఆశాజనక ఫలితాలు వచ్చే అవకాశమున్నదని, మూడో దశలో మాత్రం వేలాది మందిపై ప్రయోగిస్తే వచ్చే ఫలితాల్లో మార్పులుండొచ్చని కొల్‌కతాలోని సీఎస్ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ సీనియర్ సైంటిస్ట్ ఉపాసన రే అన్నారు. రెండో దశ ట్రయల్స్ చాలా టీకాలకు సాధ్యమేమో కానీ, మూడో దశ అంత సులువుకాదని వివరించారు. ఎందుకంటే మూడో దశలోనూ విఫలమైనా టీకాలు అనేకం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జామా ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించిన ఓ అధ్యయనాన్ని నిపుణులు ఉటంకిస్తున్నారు. ఆ అధ్యయనంలో అమెరికాలోని 640 టీకాల ఫేజ్ 3 డ్రగ్ ట్రయల్స్‌ను పరిశీలించగా అందులో 344 లేదా దాదాపు 50శాతం విఫలమయ్యాయని తేలింది.

ఆ టీకా భారత్‌కు తెచ్చే ప్రసక్తే లేదు!

రష్యా టీకాను ప్రకటించగానే కొన్ని రాష్ట్రాలు ఆ వ్యాక్సిన్‌పై ఆసక్తి కనబరిచాయి. రష్యాతో ఒప్పందాలు చేసుకుని కొనుగోలు చేసేదాకా ఆలోచనలు వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్ కొనుగోలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వ్యవహారమని, రాష్ట్రాలు ప్రత్యేకంగా ఒప్పందాలు చేసుకోవద్దని కేంద్రం రూపొందించిన కమిటీ స్పష్టం చేసింది.

కరోనాకు టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత భారత్‌లో పంపిణీ, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వ్యాక్సినేషన్ పరిశీలనలాంటి విషయాలను పర్యవేక్షించడానికి నిటి అయోగ్ (హెల్త్) మెంబర్ డాక్టర్ వికే పౌల్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కాగా, ఈ కమిటీలోని సీనియర్ మెంబర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి మూడో దశ హ్యూమన్ ట్రయల్స్ పూర్తి చేయలేదని, ట్రయల్స్ సమగ్ర వివరాలు, సురక్షిత, సమర్థత సమాచారమూ వెల్లడించలేదని చెబుతూ ఆ టీకాను భారత్‌కు తీసుకొచ్చే ప్రసక్తే లేదని అభిప్రాయపడ్డారు.



Next Story