మిడతలపై యుద్ధం.. యూకే నుంచి స్ప్రేయర్‌ల కొనుగోలు!

by  |
మిడతలపై యుద్ధం.. యూకే నుంచి స్ప్రేయర్‌ల కొనుగోలు!
X

న్యూఢిల్లీ: పంటను నాశనం చేస్తున్న మిడతల దండును ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం యూకే(యునైటెడ్ కింగ్‌డమ్) నుంచి 15 పిచికారి యంత్రాల(స్ప్రేయర్)ను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. 15 రోజుల్లోపు వీటి కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. వీటికితోడు మరో నెల లేదా నెలన్నర రోజుల్లో ఇంకో 45 స్ప్రేయర్‌లను కొనుగోలు చేయనున్నట్టు వివరించింది. అంతేకాదు, పురుగుల మందును పిచికారి చేయడానికి డ్రోన్‌లు, హెలికాప్టర్‌లను వినియోగించనున్నట్టు తెలిపింది. మిడతల దాడిని అరికట్టేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నేతృత్వంలో శుక్రవారం వ్యవసాయ అధికారుల సమీక్ష జరిగింది. మిడతల దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నారని, కట్టడి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి తోమర్ తెలిపారు. ఇందులో భాగంగానే రసాయనాల పిచికారి కోసం 15 ప్రత్యేక స్ప్రేయర్ యంత్రాలను కొనుగోలు చేయనున్నారని, 15 రోజుల్లో బ్రిటన్ నుంచి అవి మనదేశానికి బయల్దేరుతాయని వివరించారు. ఈ యంత్రాలతో పిచికారీ చేయలేని స్థలాల్లో స్ప్రే కోసం డ్రోన్‌లను వినియోగించనున్నారని పేర్కొన్నారు. మిడతల దండును ఎదుర్కొనేందుకు రాష్ట్రాల వ్యవసాయ శాఖలు, స్థానిక అధికారులు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)లతో సమన్వయంలో ఉన్నామని వివరించారు. అంతేకాదు, మిడతలతో నష్టపోయిన రాష్ట్రాలకు అదనపు వనరుల కేటాయించనున్నట్టు, అవసరం మేరకు ఆర్థిక సహకారాన్ని అందించనున్నట్టు హామీనిచ్చారు. రాజస్తాన్‌లోని బార్మర్, జోధ్‌పూర్, నాగౌర్, బికనీర్, సూరత్‌గడ్, దౌసా జిల్లాలు, యూపీలోని ఝాన్సీ జిల్లా, మధ్యప్రదేశ్‌లోని రేవా, మొరేనా, బెతుల్, ఖాండ్వా జిల్లాలు, మహారాష్ట్రలోని అమరావతి జిల్లాల్లో మిడతల దాడిని ఎదుర్కొనేందుకు కంట్రోల్ ఆపరేషన్ చేపట్టినట్టు వ్యవసాయ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.


Next Story

Most Viewed