బాల్య వివాహాలను అడ్డుకున్న షీ టీమ్స్

by  |
బాల్య వివాహాలను అడ్డుకున్న షీ టీమ్స్
X

దిశ, క్రైమ్‌బ్యూరో: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు బాల్య వివాహాలను షీటీమ్స్ అడ్డుకున్నాయి. జవహర్‌నగర్, కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం తెలుసుకున్న షీ టీమ్స్, స్థానిక పోలీసులు, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ బృందాలు సంయుక్తంగా వధూవరుల తల్లిండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి పెళ్లి కార్యక్రమాలు ఆపేలా చర్యలు తీసుకున్నారు.

మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్ శ్రీరామకాలనీలో 17సంవత్సరాల బాలికకు అదే ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువకునికి ఆగష్టు 5న పెళ్లి నిశ్చయించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న కుషాయిగూడ డివిజన్ షీ టీమ్ పోలీస్ అధికారులు, మేడ్చల్ జిల్లా బాలల పరిరక్షణ కమిటీ, చైల్డ్ హెల్ప్ లైన్ అధికారుల బృందం వధూవరుల తల్లిదండ్రులకు కౌనెల్సింగ్ నిర్వహించారు. అటు మేడ్చల్ జిల్లా కీసర పరిధిలోని నాగారంలో తల్లిదండ్రులు లేని 16 ఏళ్ల బాలికకు 26 ఏళ్ల యువకుడితో వివాహం ఖరారు చేశారు. శుక్రవారం జవహర్‌నగర్ దేవేంద్రనగర్ పెద్దమ్మ టెంపుల్ వద్ద వివాహం అవుతున్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో వివాహా కార్యక్రమం వద్దకు వెళ్లి కౌన్సెలింగ్ నిర్వహించి అడ్డుకున్నారు.

రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. లేదంటే రెండేళ్ల జైలు శిక్ష రూ.లక్ష జరిమానా ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు- 2009 ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్‌లో భాగంగా బాలికలు ఖశ్చితంగా బడిలో ఉండాలన్నారు. బాల్య వివాహాల సమాచారాన్ని 9490 617 111 వాట్సప్ నెంబరు లేదా, 100కు ఫోన్ చేసి చెప్పాలని కోరారు. బాల్య వివాహాలను అడ్డుకున్న షీ టీమ్స్‌ను సీపీ అభినందించారు.


Next Story