మహిళల జీవితాలతో హెడ్ మాస్టర్ చెలగాటం

by  |
మహిళల జీవితాలతో హెడ్ మాస్టర్ చెలగాటం
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు నైతిక విలువలు నేర్పించాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు అనైతికంగా వ్యవహారించాడు. గౌరవప్రదమైన వృత్తిలో ఉండి అందరితో ఛీ కొట్టించుకునేలా చేశాడు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. బడిలో పాఠాలు చెప్పాల్సిన అతడు.. చివరకు జైలులో ఊసులు లెక్కపెట్టేలా ఘనకార్యాలు చేశాడు.

కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన శీలం సురేశ్.. ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ప్రభుత్వ కొలువు ఉన్నా.. ఇతడికి మహిళల జీవితాలను నాశనం చేయడమే కర్తవ్యంగా పెట్టుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ముగ్గురిని పెండ్లి చేసుకొని.. మరో ఇద్దరి మహిళలను లొంగదీసుకున్నాడు.

శీలం సురేశ్ తొలుత 2011లో శాంతి ప్రియ అనే యువతిని పెండ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అదనపు కట్నం తీసుకురమ్మని ఆమెని తీవ్ర ఇబ్బంది పెట్టాడు. దీనికి ఆమె నిరాకరించడంతో అదనపు కట్నం తేలేదని వదిలేశాడు. తనకు పెండ్లి కాలేదని కలరింగ్ ఇచ్చి 2015లో శైలజను రెండో వివాహం చేసుకున్నాడు. ఇక్కడ కూడా కట్నం, బంగారం తీసుకున్నాడు. తర్వాత ఆడ పిల్ల పుట్టిందన్న కారణంతో తల్లిబిడ్డలను ఎట్టకేలకు వదిలించుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం ఉంటే పెండ్లి ఎలాగైనా చేసుకోవచ్చని ధీమా ఉన్నాడేమో.. అంతలోనే మూడో పెళ్లికి కూడా రహస్యంగా చేసుకున్నాడు.

చాట్రాయి మండలంలోని మర్రిబంధం ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎంగా ఉన్న సురేశ్.. అదే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న అనూష అనే టీచర్‌కు మాయ మాటలు చెప్పి మూడోసారి వివాహం చేసుకున్నాడు. కానీ, రహస్యంగా కాపురం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రెండవ భార్య శైలజ నిలదీసింది. అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న సురేశ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు, డీఈవోకు ఫిర్యాదు చేసింది.

దీంతో మహిళ సంఘాలు రంగంలోకి దిగడంతో సురేశ్ భాగోతం బట్టబయలైంది. ఈ వ్యవహారంపై మొదటి భార్య కూడా ముందుకు వచ్చి అతడు మరో ఇద్దరి జీవితాలను నాశనం చేశాడని ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతమంది యువతుల జీవితాలతో ఆడుకున్న శీలం సురేశ్‌ను కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


Next Story

Most Viewed