‘హోండా’ ఉద్యోగులకు వీఆర్ఎస్ స్కీమ్ ప్రకటన

by Harish |
‘హోండా’ ఉద్యోగులకు వీఆర్ఎస్ స్కీమ్ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ రెండో అతిపెద్ద టూ-వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా తన ఉద్యోగుల వాలెంటరీ రిటైర్‌మెంట్ పథకాన్ని(వీఆర్ఎస్) ప్రకటించింది. 2019 వరకు పరిశ్రమలో మందగమన పరిస్థితులు, 2020లో కరోనా సంక్షోభం కారణంగా వాహన పరిశ్రమపై తీవ్రమైన ప్రభావం పడిందని కంపెనీ తన లేఖలో వెల్లడించింది. భారీగా డిమాండ్ క్షీణతతో కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతుందని, దేశీయంగా సంస్థ ఉనికిని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోక తప్పడంలేదని ఉద్యోగులకు ఇచ్చిన లేఖలో కంపెనీ వివరించింది.

అంతేకాకుండా, వీఆర్ఎస్ అవకాశాన్ని ఎంచుకున్న వారిలో మొదటి 400 మంది ఉద్యోగులకు అదనంగా రూ. 50 వేలను అందజేయనున్నట్టు స్పష్టం చేసింది. కంపెనీ ప్రకటించిన వీఅర్ఎస్ ప్రకారం..దీన్ని ఎంచుకునేందుకు పదేళ్ల అనుభవం లేదంటే, 2021, జనవరి 31 నాటికి 40 ఏళ్లు వయసు పైబడిన వారు ఎంచుకోవచ్చని సూచించింది. కాగా, భారత్‌లో హోండా సంస్థకు మొత్తం నాలుగు ప్లాంట్‌లు ఉండగా మొత్తం 7,000 మంది ఉద్యోగులు వీటిలో పనిచేస్తున్నారు. వాహన పరిశ్రమ తీవ్రమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచేందుకు ఉత్పాతి వ్యూహాన్ని నిర్ణయించినట్టు హోండా వెల్లడించింది.

Next Story

Most Viewed