ప్రభుత్వం చెప్పింది ఉత్త మాటేనా..?

by  |
ప్రభుత్వం చెప్పింది ఉత్త మాటేనా..?
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి : నిన్నా..మొన్నటి వరకు హైదరాబాద్ నగరంలో కరోనా ఉధృతి అత్యధికంగా ఉండగా, ప్రస్తుతం రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోనూ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నది. శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్​లో హైదరాబాద్​ నగరంలో 508 కేసులు నమోదు కాగా, రంగారెడ్డిలో 205, మేడ్చల్ లో 207, వికారాబాద్ లో 58 పాజిటివ్ కేసులు వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ఇంత మందికి ఆసుపత్రుల్లో చికిత్స చేయడం సాధ్యంకాదని రాష్ట్ర ప్రభుత్వం హోం ఐసొలేషన్ పద్ధతిలో చికిత్స అందివ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కిట్లు ఇంటింటికీ అందిస్తామని తెలిపారు. కానీ, స్థానిక వైద్యారోగ్య అధికారుల నిర్లక్ష్యంతో హోం ఐసొలేషన్ లో ఉన్న బాధితులకు కిట్లు పంపిణీలో జాప్యం జరుగుతుంది. అంతేకాకుండా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధి అర్బన్ ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకులు చెబితేనే కరోనా కిట్లు ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కేసులు పెరుగుతున్నా పట్టింపు లేదు

హైదరాబాద్ నగరంతోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సైతం పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నా.. వైద్యారోగ్య శాఖాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వికారాబాద్ జిల్లా ఆనంతగిరి, తాండూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు చేస్తామని చెబుతున్నప్పటికీ అవసరమైన పరికరాలు అందుబాటులో లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలో సుమారు 20 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఇందులో 10 వేలకు పైగా బాధితులు హోం ఐసొలేషన్లో ఉన్నారు. అయితే వీరందరికీ కిట్ల పంపిణీ కాలేదని తెలుస్తున్నది. కాగా, వైద్యారోగ శాఖాధికారులు మాకే అందలేదని చెప్పుకొస్తున్నారు. కరోనా కిట్లు అందకపోవడంతోపాటు స్థానిక వైద్య సిబ్బంది తోడ్పాటు అందించకపోవడంతో ధైర్యం కోల్పోతున్న అనేక మంది బాధితులు మృతి చెందుతున్నారు.

విటమిన్ ట్యాబ్లెట్ల కోసం ఎదురుచూపులు

కరోనా బాధితులకు ప్రధానమైన సి, డి విటమిన్ మందులు బహిరంగ మార్కెట్లో దొరకడం లేదు. కానీ ప్రభుత్వం అందించే కిట్లల్లో ఆ మందులు ఉండడంతో వాటి కోసం రోగులు ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు కరోనా కిట్ల పంపిణీ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలోని దవాఖానల్లో ర్యాపిడ్ కిట్లతో లక్షణాలున్న వారికే టెస్టులు చేస్తున్నారు. అయితే కొవిడ్​ లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్ రావడంతో ప్రతి ఒక్కరూ టెస్టులు చేసుకునేందుకు సుముఖత చూపిస్తున్నారు. గతంలో టెస్టులు చేసుకునేందుకు కొంత ఇబ్బంది పడినప్పటికీ పరీక్షలు చేసుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు.



Next Story