‘కలెక్టర్ సార్.. మాకూ పింఛన్ ఇప్పించండి’

by  |
‘కలెక్టర్ సార్.. మాకూ పింఛన్ ఇప్పించండి’
X

దిశ, వరంగల్: కరోనా వైరస్ విస్తృత వ్యాప్తి మూలగా లాక్‌డౌన్ విధించడంతో హిజ్రాలు ఉపాధి కోల్పోయారు. మూడు నెలలుగా ఎలాంటి ఆదాయం లేకపోవడంతో ఇల్లు గడవక అనేక ఇబ్బందులు పడుతున్నారు. తమను ఆదుకునే నాథుడు లేకపోవడంతో సోమవారం కలెక్టర్‌ను కలిసి గోడును వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వ ఫథకాలు తమకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. వివరాళ్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లాలో సుమారు 25 మంది హిజ్రాలు ఉన్నారు. వీరంతా రైళ్లు, బస్టాండ్లు, వ్యాపార వాణిజ్య సముదాయాల ముందు భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో వ్యాపార వాణిజ్య సంస్థలు మూత పడ్డాయి. రైళ్లు, బస్సులు నిలిచిపోయాయి. అంతేగాకుండా లాక్‌డౌన్‌లో ప్రజలెవరూ బయటకు రావొద్దని ఆంక్షలు విధించడంతో హిజ్రాలకు బతుకు భారమైంది. అన్ని వర్గాల ప్రజలు ఆదాయం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న క్రమంలో హిజ్రాలు సైతం భిక్షాటనకు దూరంగా ఉన్నారు. దీంతో సోమవారం పలువురు హిజ్రాలు మహబూబాబాద్ కలెక్టర్‌ను కలిసి ప్రభుత్వం పథకాల్లో భాగంగా ఒంటరి మహిళలకు మాదిరిగా తమకు ఫింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. అంతేగాకుండా రేషన్ కార్డు, డబుల్ బెడ్ రూం పథకం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.


Next Story

Most Viewed